బాలీవుడ్ యాక్టర్ రాజ్పాల్ యాదవ్కు చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలన్న గత ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన ‘మర్సీ పిటిషన్’ను (దయ పిటిషన్) కోర్టు తిరస్కరించింది. ఫిబ్రవరి 4న లొంగిపోవాలని ఇచ్చిన ఆదేశాలను ఆయన పాటించకపోవడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ, కోర్టు ఆదేశాలను పాటించకపోవడం చట్టంపై ఆయనకు ఉన్న గౌరవాన్ని ప్రశ్నార్థకం చేస్తుందని వెల్లడించారు. ఈ క్రమంలో రాజ్పాల్ యాదవ్ తక్షణమే తిహార్ జైలు సూపరింటెండెంట్ ఎదుట లొంగిపోవాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ALSO READ : రామ్ చరణ్ 'ట్విన్స్'కు బాలయ్య స్పెషల్ గిఫ్ట్..
అంతేకాదు, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడం వంటి కారణాలతో ఎలాంటి ప్రత్యేక సడలింపులు ఇవ్వబోమని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాల అనంతరం, రాజ్పాల్ యాదవ్ గురువారం సాయంత్రం (ఫిబ్రవరి 5న) తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు.
రాజ్పాల్ యాదవ్ తరఫు లాయర్ వెర్షన్:
రాజ్పాల్ యాదవ్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేస్తూ, ఫిర్యాదుదారు సంస్థ అయిన ఎం/ఎస్ మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు (Murali Projects Pvt Ltd) చెల్లించాల్సిన మొత్తాన్ని సమకూర్చే ప్రయత్నాల్లో ఉండటంతోనే ఢిల్లీకి ఆలస్యంగా చేరుకున్నారని తెలిపారు. అందువల్లే కోర్టు ఆదేశాలను సమయానికి పాటించలేకపోయానని వివరణ ఇచ్చారు. ఈ కారణాలతో కొంత సమయం ఇవ్వాలని కోరుతూ దయ పిటిషన్ దాఖలు చేశారు.
ALSO READ : “గుంజీ గుంజీ” పాట వివాదం.. హీరో చంద్రహాస్పై మరో కేసు నమోదు!
కానీ కోర్టు ఈ వాదనలను తిరస్కరించింది. “చట్టం తన ఆదేశాలను పాటించే వారికే రక్షణ కల్పిస్తుంది, అవమానించే వారికి కాదు. ఒకసారి ఉపసంహరణ ఇచ్చినట్లయితే, కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేసినా సరే అనే తప్పుడు సంకేతం సమాజానికి వెళ్తుంది” అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
కేసు వివరాలు:
కొన్ని సంవత్సరాల క్రితం రాజ్పాల్ యాదవ్ మరియు ఆయన భార్యపై ఒక ప్రైవేట్ కంపెనీ కేసు దాఖలు చేసింది. చెల్లింపుల విషయంలో ఇచ్చిన అనేక చెక్కులు బౌన్స్ కావడం, బాకీ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమవడం వంటి ఆరోపణలతో ఈ కేసు నమోదు అయింది.
ALSO READ : విజయ్కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ.. పెనాల్టీ కట్టాల్సిందేనని ఆదేశం
ఈ కేసు పరిణామాల్లో భాగంగా, జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలన్న దిగువ కోర్టు ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. నటుడి స్థాయి లేదా నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వబోమని కోర్టు మరోసారి తేల్చిచెప్పింది.
నటుడు రాజ్పాల్ యాదవ్.. హిందీతో పాటుగా మరాఠీ, భోజ్పురి, పంజాబీ, బెంగాలీ, తెలుగు భాషల్లో నటించారు. బాలీవుడ్ లో ‘భూల్ భూలయ్య’, ‘డ్రీమ్ గర్ల్ 2’, ‘బేబీజాన్’, ‘హంగామా’ వంటి భారీ ప్రాజెక్ట్స్ లో నటించి గుర్తింపు పొందారు. తెలుగులో రవితేజ నటించిన ‘కిక్ 2’తో ఎంట్రీ ఇచ్చారు.
