- మురుగునీటి ద్వారా వైరస్ వ్యాప్తి ముప్పు
- నిర్లక్ష్యం చేయొద్దు: సైంటిస్టుల హెచ్చరికలు
లండన్: కోవిడ్-19… ఇప్పటి వరకు ఈ వైరస్ మనుషులకు, పిల్లులకు, పులులకు వంటి కొన్ని జంతువులకూ వచ్చింది. కొన్ని రోజుల క్రితం టాంజానియాలో ఓ మేకకు, బొప్పాయి పండుకు కూడా కరోనా సోకినట్టు వార్తలు వచ్చాయి. గాలిలోని పొల్యూషన్ ద్వారా కూడా కరోనా వైరస్ ప్రయాణం చేస్తున్నట్టు ఇటలీకి చెందిన బలోగ్న విశ్వవిద్యాలయం ఓ పరిశోధనలో తెలిపింది. అయితే తాజాగా కరోనా సోకిన వారి మలంలో కూడా వైరస్ బతికే ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు
మురుగునీటి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, దీనిపై నిర్లక్ష్యం చేయొద్దని ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. వైరస్ సోకిన వ్యక్తుల జీర్ణవ్యవస్థ నుంచి బయటికి వెలువడే వైరస్లు.. శ్వాసకోశ నుంచి బయటికి వచ్చే వాటి కంటే ఎక్కువసేపు ఉంటాయని చెబుతున్నారు. మనిషి నుంచి మనిషికి వైరస్ ట్రాన్స్మిషన్ జరగకుండా అడ్డుకోవడంపైనే దృష్టిపెట్టారని, వేస్ట్ వాటర్ నుంచి కూడా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు.
‘‘కరోనా సోకిన వ్యక్తులకు చికిత్స తర్వాత నెగెటివ్ వచ్చినా.. మరో 33 రోజుల దాకా వారి మలంలోనూ వైరస్ ఉండే అవకాశం ఉందని ఈ మధ్య కన్ఫర్మ్ అయింది. చాలా మంది కరోనా రోగులు అసంప్టమాటిక్. లేదా మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వాళ్లే. ఇంట్లోనే క్వారంటైన్లో ఉంటారు. కాబట్టి మురుగు కాలువల ద్వారా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది’’ అని స్కాట్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ స్టిర్లింగ్కు చెందిన రిచర్డ్ క్విల్లియం చెప్పారు. బహిరంగ మలవిసర్జన ఎక్కువగా జరిగే ప్రాంతాలు, పారిశుధ్య వ్యవస్థలు సరిగ్గాలేని ఏరియాల్లో వైరస్ ప్రభావం మరింతగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మైల్డ్ సింప్టమ్స్ ఉన్న, అసంప్టమాటిక్ కరోనా రోగుల నుంచి సేకరించిన పరిమిత డేటా ఆధారంగా ఈ రీసెర్చ్ సాగింది. ‘ఎన్విరాన్మెంటల్ ఇంటర్నేషనల్’ అనే జర్నల్లో రీసెర్చ్ పబ్లిష్ అయింది.

