దేశంలో విధించిన లాక్ డౌన్ కారణంగా చాలామంది ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రభుత్వాలు సాయం ప్రకటించినా అవి తమకు సరిపోక.. మరో మార్గం వెతుక్కుంటున్నారు. రాజస్థాన్ లో ప్రముఖ మెజీషియన్ గా పేరుగాంచిన రాజు మహోర్ అనే వ్యక్తి కూడా లాక్డౌన్ విధించడంతో పని లేకుండా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో ప్రభుత్వాలు కేవలం నిత్యావసరాలు, కూారగాయలు అమ్ముకోవడానికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ధోల్ పూర్ జిల్లాకు చెందిన రాజు మహోర్(38) ఉత్తరాది రాష్ట్రాల్లో ఆర్జే సామ్రాట్ జాదూగర్ అనే పేరుతో ఎంతో ప్రసిద్ధుడు. గత 15 ఏళ్లుగా మేజిక్ ఈవెంట్స్ చేస్తూ.. కనీసం రోజుకు 10 వరకు షోలు నిర్వహించేవాడు. కానీ ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా తన ఉపాధికి గండి పడడంతో.. అతనితో పాటు సుమారు 12 మందికి పూట గడవటం కష్టంగా మారింది. ఇక చేసేదేమి లేక కూరగాయలు అమ్మడం ప్రారంభించాడు. ధోల్ పూర్ జిల్లాలోని ఓ కూరగాయల మార్కెట్లో అతన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఇదేంటని కొంత మంది ప్రశ్నించగా.. ఇంటి అద్దె కట్టాలన్నా, కుటుంబాన్ని పోషించాలన్నా డబ్బు తప్పనిసరి అని, కూరగాయలు అమ్ముకోవడం తప్ప తనకు మరో ఆలోచన రాలేదని సామ్రాట్ జాదూగర్ తెలిపాడు.