న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న కరోనా మహమ్మారిని అంతం చేయడానికి వ్యాక్సిన్ను కనుగొనే పనుల్లో అన్ని దేశాలు నిమగ్నమై ఉన్నాయి. పలు వ్యాక్సిన్లు చివరి దశల్లో ఉండటం శుభపరిణామంగా చెప్పొచ్చు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. కరోనాను అంతం చేయడానికి మౌత్వాష్ సరిపోతుందని సైంటిస్టులు చెబుతున్నారు. మౌత్వాష్ చేస్తే 30 సెకన్లలో వైరస్ చనిపోతుందని అంటున్నారు.
వివరాలు.. మౌత్వాష్ ద్వారా కరోనా వైరస్ ముప్పై సెకన్లలో అంతమవుతుందని యూకేలోని కార్డిఫ్ యూనివర్సిటీ సైంటిస్టులు చెప్పారు. ఈ మేరకు తమ పరిశోధన వివరాలను గత వారం ఓ జర్నల్లో పబ్లిష్ చేశారు. ఈ రీసెర్చ్ పేపర్ను రివ్యూ చేయాల్సి ఉంది. మౌత్వాష్ కోసం వినియోగించే సెటిపిరినియం క్లోరైడ్ (సీపీసీ)ను తమ ల్యాబ్లో ప్రయోగించినప్పుడు కరోనాను విజయవంతంగా నిర్మూలించిందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే కరోనా ట్రీట్మెంట్లో మౌత్వాష్ను చేర్చాలా వద్దా అనే దానిపై మాత్రం ఎలాంటి వివరాలను స్పష్టం చేయలేదు. ఎందుకంటే మౌత్వాష్ ఊపిరితిత్తులను చేరాలి. కానీ సహజ పద్ధతుల్లో ఇది సాధ్యం కాదని నిపుణులు పేర్కొంటున్నారు.