దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా రికవరీ రేటు 62.09 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో గురువారం ఉదయం వరకు 7,67,296 కరోనా కేసులు నమోదు కాగా, 475,378 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,69,789 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. దేశంలో కరోనా చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసుల కన్నా ఇప్పటికే కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,06,588 మేర అధికంగా ఉందని కేంద్రం తెలిపింది. యాక్టివ్ కేసుల కన్నా రికవరీ అయిన వారు 1.75 రెట్లు అధికంగా ఉన్నారని పేర్కొంది.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు టెస్టుల సామర్థ్యం భారీగా పెంచుతున్నామని కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో 2,67,061 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు కోటి ఏడున్నర లక్షల కరోనా పరీక్షలు చేశామని పేర్కొంది.