- చర్యలు అవసరం అంటున్న నిపుణులు
చైనాలోని వూహాన్లో పుట్టి.. ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. వూహాన్లో తగ్గుముఖం పట్టిన వైరస్ ప్రభావం మిగతా ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చాలా దేశాలు లాక్డౌన్ విధించాయి. అయినా వైరస్ కంట్రోల్ అయిన పరిస్థితి కనిపించలేదు. దీంతో కొన్ని దేశాలు మళ్లీ లాక్డౌన్ దిశగా చర్యలు చేపడతున్నాయి. వైరస్ను అరికట్టేందుకు ఆస్ట్రేలియా, హాంకాంగ్ ఇప్పటికే లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. “ వైరస్ ఉన్న వారు ఎక్కడ నుంచి వస్తారో మనకు తెలీదు. మూలాలు తెలియని సంక్రమణ మొదలైతే వ్యాధి నియంత్రణ చాలా కష్టం” అని చైనా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ యాంగ్ గొంగ్వాన్ అభిప్రాయపడ్డారు. వైరస్ ఎక్కడ నుంచి సోకుతుంది, కాంటాక్ట్ ఎవరు అనేది తెలిసినన్ని రోజులు రిలాక్స్గానే ఉండొచ్చని, కానీ కేసులు వందల్లో పెరిగితే మాత్రం కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటదని ఆయన సూచించారు.
హాంకాంగ్లో స్ట్రిక్ట్ రూల్స్:
హాంకాంగ్లో వైరస్ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొచ్చింది. రూల్స్ కూడా స్ట్రిక్ట్ చేసింది. కేసులు ఎలా వ్యాప్తిస్తున్నాయో అర్థం కాని నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. సమ్మర్ బ్రేక్ తర్వాత ప్రారంభమైన స్కూళ్లు, జిమ్లు, బార్లను మూసేశారు. పబ్లిక్ గ్యాథరింగ్స్కు కేవలం నలుగురిని మాత్రమే అనుమతిస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మాస్క్లు పెట్టుకోని వారికి దాదాపు 645 డాలర్లు ఫైన్ విధిస్తున్నారు.
మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో లాక్డౌన్:
మెల్బోర్న్, సిడ్నీల్లో వైరస్ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఆరు వారాల పాటు పూర్తి లాక్డౌన్ విధించారు. దేశంలోని దాదాపు 51శాతం కేసులు ఎలా వచ్చాయి అనే విషయం తేలకపోవడంతో డేంజర్లో ఉన్నామని భావించిన అధికారులు లాక్డౌన్ విధించారు. చైనాలోని వూహాన్లో విధించినంత కఠినమైన నిబంధనలను విధించారు.