ప్రార్థన మందిరాలు, వ్యాపార సంస్థలతోనే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ : శ్రీనివాస్ రెడ్డి

ప్రార్థన మందిరాలు, వ్యాపార సంస్థలతోనే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ :  శ్రీనివాస్ రెడ్డి
  • పోలీసులతో పాటు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియంత్రణ పాటించాలి

హైదరాబాద్‌‌,వెలుగు: దేశంలోని మెట్రో సిటీస్‌‌తో పోలిస్తే హైదరాబాద్‌‌లో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని సిటీ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఫుట్‌‌పాత్‌‌ల ఆక్రమణ, రోడ్ల మధ్యనే ప్రార్థన మందిరాలు, వ్యాపార సంస్థలు ఉండడమే ట్రాఫిక్ జామ్​కు ప్రధాన కారణమని పేర్కొన్నారు. సిటీలో రోడ్ల విస్తీర్ణం చాలా తక్కువగా ఉందన్నారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్(హెచ్‌‌సీఎస్‌‌సీ) ఆధ్వర్యంలో గురువారం బంజారాహిల్స్​లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌లో ట్రాఫిక్​పై మీటింగ్ జరిగింది. 

సిటీలో ట్రాఫిక్‌‌లో పనిచేసే 45 మంది ట్రాఫిక్‌‌ వలంటీర్లను, ట్రాఫిక్‌‌ పోలీసులను సీపీ సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిటీలో వాహనాల పెరుగుదలకు అనుగుణంగా రోడ్ల విస్తరణ లేదన్నారు. ట్రాఫిక్ నియంత్రణ పోలీసుల బాధ్యతే కాదని,  ప్రతి ఒక్కరిదని సూచించారు. డ్యూటీల్లో ట్రాఫిక్ పోలీసులు నిబద్ధతతో పనిచేయాలని పేర్కొన్నారు. 

వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో చలాన్లు వేయడం కంటే ట్రాఫిక్‌‌ను కంట్రోల్ చేయాలని సూచించారు. ట్రాఫిక్ సిబ్బందికి 30 శాతం అలవెన్స్‌‌లు ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. ఇతర సిటీస్‌‌తో పోలిస్తే సిటీలో కార్ పూలింగ్ తక్కువగా వాడుతున్నారని ట్రాఫిక్‌‌ నియంత్రణపై ప్రజల్లో అవగాహన కలిపిస్తామని తెలిపారు.

నుమాయిష్​ను చూస్తుంటే ఆ రోజులు గుర్తుకొస్తున్నయ్..

బషీర్​బాగ్ : నుమాయిష్ ​ఎగ్జిబిషన్​ను చూస్తుంటే తాను 22 ఏండ్ల కిందట సిటీ ట్రాఫిక్ విభాగంలో పనిచేసిన రోజులు గుర్తుకొస్తున్నాయని సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి తెలిపారు. నాంపల్లిలో జరుగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన పోలీస్ స్టాల్​ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తకోట శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ..  ఈ స్టాల్​లో ట్రాఫిక్ రూల్స్ , సైబర్ క్రైమ్, షీ టీమ్ పనితీరుపై సందర్శకులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ కోటతో పాటు నుమాయిష్​కు కూడా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 

ప్రతి ఏటా నుమాయిష్​లో పోలీస్ స్టాల్​ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గతేడాది నుమాయిష్​లో ఏర్పాటు చేసిన స్టాల్​ను లక్షా 20 వేల మంది  సందర్శించారన్నారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ జరిగే 45 రోజుల పాటు ట్రాఫిక్ సిబ్బంది అలర్ట్​గా ఉంటూ డ్యూటీ చేయాలన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని బాలికల విద్య కోసం ఖర్చు చేస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులను సీపీ అభినందించారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు, పోలీస్ అధికారులతో కలిసి సీపీ మొబైల్ ట్రైన్​లో ఎక్కి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మొత్తం తిరిగి చూశారు.