కార్మికుల శవాలపై నడవాలని చూస్తే జాగ్రత్త.. కేసీఆర్కు నారాయణ హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు:ఆర్టీసీ కార్మికుల శవాలపై నడవాలని కేసీఆర్ చూస్తున్నారని, కానీ ఆయనను ఆర్టీసీ కార్మికులు బస్సు టైర్ల కింద నలిపేస్తారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హెచ్చరించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసి బస్సులను నడపాలని చూస్తే కార్మికులు ఊరుకోరని, వాటిని అగ్నికి ఆహూతి చేస్తారని అన్నారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి సంతాపసభ, వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. నారాయణతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, అడ్వకేట్ రచనారెడ్డి, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఆర్టీసీ నేతలు థామస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నారాయణ మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమం ముందు నిజాం నవాబే తలవంచక తప్పలేదని, కేసీఆర్ ఎంత అని వ్యాఖ్యానించారు. ఏపీలో ఆర్టీసీని విలీనం చేశారని, జగన్ను చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఓయూను పాకిస్థాన్లా చూస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు టీఎన్జీవోలు మద్దతు ఇవ్వాలని, అలా ఇవ్వకపోతే భవిష్యత్తులో టీఎన్జీవోలకు కష్టం వస్తే మద్దతు ఎవరూ ఇవ్వరని హెచ్చరించారు.
కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్: తమ్మినేని
ఆర్టీసీ సమ్మెకు ముందే ప్రైవేటు వాళ్లతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని, అందువల్లే ఆర్టీసీ విలీనం విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు కాని ఆర్టీసీ కార్మికులను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. డిస్మిస్ అంటే లీగల్గా ఇరుక్కుంటారనే భయంతో సెల్ఫ్ డిస్మిస్ అనే పదాన్ని కేసీఆర్ వాడారని ఎద్దేవా చేశారు. ఎవరబ్బ సొమ్మని ఆర్టీసీని 50 శాతం ప్రైవేటీకరిస్తారని మండిపడ్డారు.
కేసీఆర్.. జాగ్రత్త: రచనారెడ్డి
సీఎం కేసీఆర్ వైఖరి మార్చుకోవాలని, లేకపోతే ఎక్కువ రోజుల ఉండలేరని అడ్వకేట్ రచనారెడ్డి అన్నారు. సెల్ఫ్ డిస్మిస్ అనే పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా లేదని ఎద్దేవా చేశారు.