హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్నది రాజ్ భవన్ కాదని.. బీజేపీ భవన్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. శాసనసభ ఆమోదించిన బిల్లులు పంపడానికి కాలపరిమితి లేదని, ఎంత కాలమైనా ఆపుతామని, తామే సుప్రీం అని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె గవర్నర్ గా కాకుండా బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుపై అభ్యంతరాలుంటే.. మిగతా బిల్లులను ఎందుకు తొక్కిపెట్టారని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకొని ప్రజలలో వ్యతిరేకత తీసుకురావాలనే లక్ష్యంతో గవర్నర్ పని చేస్తున్నట్లున్నదని ఆరోపించారు. మంత్రులు తన వద్దకు వచ్చి సమాధానం చెప్పాలనడం అహంకారపూరిత వైఖరికి నిదర్శనమన్నారు.