- సర్కారు ‘డబుల్’ ఇండ్లు ఇవ్వకపోవడంతో రెండేండ్లుగా లెఫ్ట్ పార్టీల భూపోరాటాలు
- వివిధ జిల్లాల్లో వెలసిన వందల కాలనీలు..
- ఒక్క పిలుపుకే వేలాదిగా తరలివస్తున్న పేదలు
- అసంఘటిత రంగ కార్మికుల తరపునా ఉద్యమాలు
- సింగరేణిలోని 9 నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే స్థితిలో కామ్రేడ్స్
- ఇన్నాళ్లూ ఈ ఓట్లన్నీ తమవేనని సంబరపడ్డ బీఆర్ఎస్ నేతలు
- హైకమాండ్ తీరుతో ఆశలు ఆవిరి
వరంగల్, వెలుగు: బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎర్రజెండాల టెన్షన్ పట్టుకున్నది. మునుగోడు ఎన్నికల్లో కామ్రేడ్ల మద్దతుతో గట్టెక్కిన గులాబీ పార్టీ నేతలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తులుంటాయని, దీంతో ఆయా నియోజకవర్గాల్లో తమ గెలుపును ఎవరూ ఆపలేరని భావించారు. తీరా కేసీఆర్ వైఖరి వల్ల పొత్తు చిత్తు కావడం, కమ్యూనిస్టులు కాస్తా కాంగ్రెస్కు దగ్గరవుతుండడంతో గులాబీ క్యాండిడేట్లు ఆందోళన చెందుతున్నారు.2018 ఎన్నికలకు ముందు నామమాత్రంగా ఉన్న కమ్యూనిస్టులు ఐదేండ్లలో రాష్ట్ర సర్కారు తీరువల్లే పుంజుకున్నారు. పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వకపోవడంతో ఇదే అదనుగా కమ్యూనిస్టులు భూపోరాటం చేసి లక్షలాది పేదలను సమీకరించారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకోసం కామ్రేడ్స్ కదన రంగంలోకి దూకారు. అసంఘటిత రంగ కార్మికుల ఉద్యమాలకూ నాయకత్వం వహించారు. ఇలా గడిచిన రెండేండ్లలో కమ్యూనిస్టులకు మద్దతు పెరుగుతూ వచ్చినా, చివరికి ఆ ఓటు బ్యాంకు తమ ఖాతాలోనే పడ్తుందని బీఆర్ఎస్ నేతలు ఆశించగా, చివరికి ఉల్టా అయ్యింది.
వందల్లో కమ్యూనిస్టు కాలనీలు..
రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీల బలాబలాల సంగతి ఎలా ఉన్నా ఎర్రజెండా పోరాటాలను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. గడిచిన నాలుగేండ్లలో రూలింగ్ పార్టీ తీరువల్ల క్షేత్రస్థాయిలో కమ్యూనిస్టులు వివిధ వర్గాల్లో పట్టు సాధించారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ జిల్లాలు,
నియోజకవర్గాల్లో సీపీఐ, సీపీఎం పోరాటాల ఫలితంగా వెలిసిన వందలాది కాలనీలు చాలా ఏండ్ల నుంచి ఉన్నాయి. దీనికితోడు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వకపోవడంతో ఏడాది, ఏడాదిన్నరగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వందలాది కొత్త కాలనీలు వెలిశాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మంలాంటి జిల్లాల్లో ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించి వేలాది మంది గుడిసెలు వేసుకున్నారు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల కుటుంబాలకు ఇండ్లు లేవని భావిస్తుండగా, అందులో ఏం తక్కువ 5 లక్షల మంది ఈ భూపోరాటాల్లో పాల్గొన్నట్లు కమ్యూనిస్టులు చెప్తున్నారు. వీరంతా ఎర్రజెండా పార్టీల నేతల ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నారు. ఇక అసంఘటిత రంగ కార్మికుల విషయంలో సర్కారు అవలంభించిన విధానం వల్ల రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఆయా వర్గాల్లో పట్టు సాధించారు. ముఖ్యంగా పంచాయతీ, మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీలు ఆశా వర్కర్లు, ఇతరత్రా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ఉద్యోగుల హక్కుల కోసం ముందుండి పోరాడారు. కమ్యూనిస్టులతో పొత్తులు ఖాయమైతే ఆయా వర్గాలు బీఆర్ఎస్కు ఔట్రైట్గా మద్దతు పలికేవి. ఇప్పుడా పరిస్థితి లేదంటున్నారు.
సింగరేణి పరిధిలోని నియోజకవర్గాలపైనా ఎఫెక్ట్
సింగరేణి విస్తరించిన మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో లెఫ్ట్ పార్టీలకు బలమైన కేడర్ ఉంది. ఈ జిల్లాల పరిధిలో 43వేల మంది కార్మిక కుటుంబాల్లో సుమారు 2లక్షల మంది ఓటర్లు ఉంటారు. 30వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు, 50వేల మంది రిటైర్డు ఉద్యోగుల కుటుంబాలను కలుపుకుంటే 5లక్షల మంది వరకు ఓటర్లుంటారు. ఈ కార్మికుల మద్దతుతో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ బలమైన యూనియన్గా కొనసాగుతోంది. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులు గెలుపోటములను శాసించగలిగే స్థితిలో ఉన్నారు. కమ్యూనిస్టులతో పొత్తుల కారణంగా 2018 ఎన్నికల్లో భూపాలపల్లి, భద్రాచలం, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలిచింది. రామగుండంలో ఏఐబీఎఫ్ అభ్యర్థి, సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ విజయం సాధించింది. ఈసారి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే 9 నియోజకవర్గాల్లో తమ గెలుపును ఎవరూ ఆపలేరని బీఆర్ఎస్అభ్యర్థులు ఆశించారు. కానీ పొత్తు కుదరకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్ తర్వాత అంతే పెద్ద సిటీగా భావించే గ్రేటర్ వరంగల్లో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో పాతవి, కొత్తవి కలిపి దాదాపు 100కు పైగా కమ్యూనిస్ట్ కాలనీలు ఉన్నాయి. ఇందులో ఒక్కో కాలనీలో కనిష్ఠంగా 250, గరిష్ఠంగా వెయ్యి నుంచి 1200 గుడిసెలు ఉన్నాయి. ఏ లెక్కనచూసినా 50వేలకుపైగా ఓటర్లు ఉంటారు. కమ్యూనిస్టులతో ఎలాగూ పొత్తులు ఉంటాయనే ఆలోచనతో ఇన్నిరోజులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీళ్లను తమ ఓటు బ్యాంకుగా భావించారు. కానీ సీఎం కేసీఆర్ కామ్రేడ్లను దూరం పెట్టడంతో ఈ ఓట్లు ఎక్కడ చేజారిపోతాయోనని బీఆర్ఎస్క్యాండేట్లు ఆందోళన చెందుతున్నారు.