కాలిపోయిన పటాకుల లారీ.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పీఎస్ పరిధిలో ఘటన

కాలిపోయిన పటాకుల లారీ.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పీఎస్ పరిధిలో ఘటన
  •     డ్రైవర్, క్లీనర్  సేఫ్

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్  పరిధిలో శనివారం పటాకుల లారీ దగ్ధమైంది. తమిళనాడు రాష్ట్రంలోని శివకాశి నుంచి మహేశ్వరం, నిజామాబాద్  జిల్లాకు పటాకుల లోడ్​తో వెళ్తోంది. పెంజెర్ల రోడ్  నుంచి మణిక్యమ్మగూడ రోడ్  వైపు వెళ్తున్న పటాకుల లారీకి విద్యుత్​ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయి.

ప్రమాదం జరిగిన సమయంలో లారీలో ఉన్న డ్రైవర్  అయ్యప్పన్, క్లీనర్  సట్టివేల్  సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.60 లక్షల ఆస్తి నష్టం జరిగింది. డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ,ఇన్స్​పెక్టర్  నర్సయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు.