
హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంస్థ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2025ను వచ్చే నెల 15–17 తేదీల మధ్య నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఇండ్ల కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశాలను అందించే ఈ షోను ‘చాయిస్ ఈజ్ యువర్స్’ పేరుతో నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ ఎగ్జిబిషన్ రెరా -ఆమోదిత ప్రాజెక్ట్లను మాత్రమే ప్రదర్శిస్తుంది.
అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు వాణిజ్య స్థలాలు వంటి వివిధ రకాల ప్రాజెక్టులను ఈ షోలో చూపిస్తామని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు జైదీప్ రెడ్డి చెప్పారు. ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్లో ఆస్తి రిజిస్ట్రేషన్ల విలువ రూ.4,300 కోట్లు దాటిందని చెప్పారు. సంవత్సరానికి 14శాతం వృద్ధి కనిపించిందని పేర్కొంది. పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం బలమైన మౌలిక సదుపాయాల వల్ల రియల్ఎస్టేట్కు హైదరాబాద్ అనుకూలమని రెడ్డి చెప్పారు.