- రిటైల్ అప్పులు తలనొప్పే
- లెండర్లు జాగ్రత్తపడాలి : సిబిల్ సీఈఓ
ముంబై : రిటైల్ అప్పులు తలనొప్పిగా మారే ఛాన్స్ ఉందని క్రెడిట్ బ్యూరోలు హెచ్చరిస్తున్నాయి. కొవిడ్ తర్వాత భారీగా పెరిగిన అన్సెక్యూర్డ్ లోన్లుతో కొంత ఇబ్బందులుండొచ్చని సూచిస్తున్నాయి. అన్సెక్యూర్డ్ లోన్లు తీసుకుని వస్తువులను కొనడం బాగా ఎక్కువైందని, ఇలాంటి అప్పులు మార్చి 2021 –మార్చి 2023 మధ్య కాలంలో ఏకంగా ఏటా 47 శాతం చొప్పున పెరిగాయని డేటా వెల్లడిస్తోంది. మరోవైపు క్రెడిట్ కార్డ్ డెలిన్క్వెన్సీలు (గడువు ముగిశాక కూడా చెల్లింపులు జరపకపోవడం) ఎక్కువవుతున్నాయని పేర్కొంటోంది.
రిటెయిల్ లోన్లు ఇచ్చే విషయంలో పోర్ట్ఫోలియోను ఎప్పటికప్పుడు గమనించుకోవడం ఆవశ్యకమని, రిస్క్ను సరిగ్గా బేరీజు వేసుకోవడం తప్పనిసరని ట్రాన్స్యూనియన్ సిబిల్ సీఈఓ రాజేష్ కుమార్ చెప్పారు. రిటైల్ క్రెడిట్ ట్రెండ్స్పై ఈ సంస్థ ఒక రిపోర్టును తెచ్చింది. డిజిటల్, ఇన్ఫర్మేషన్ ఓరియెంటెడ్ లెండింగ్ వల్లే ప్రధానంగా రిటైల్ అప్పులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయని రాజేష్ కుమార్ వెల్లడించారు. రిటైల్అప్పులు నిలకడగా జోరందుకుంటున్నాయని పేర్కొన్నారు.
కొన్ని ప్రొడక్టులలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, మరికొన్ని ప్రొడక్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతోందని వివరించారు. డిమాండ్, సప్లయ్, కన్జూమర్ బిహేవియర్, పెర్ఫార్మెన్స్ వంటి నాలుగు అంశాల ఆధారంగా తమ రిపోర్టును రూపొందించినట్లు వెల్లడించారు. న్యూ టు క్రెడిట్ (ఎన్టీసీ) కస్టమర్ల విషయంలో లెండర్లు ఇప్పటికే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని, మార్చి 2020 లో అలాంటి కన్జూమర్లకు ఇస్తున్న అప్పుల శాతం 34 అయితే, మార్చి 2021 నాటికి 28 శాతానికి, మార్చి 2023 నాటికి 23 శాతానికి అప్రూవల్స్ తగ్గిపోయినట్లు చెప్పారు.