దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. లాక్డౌన్ను పొడిగించినా.. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కొన్ని సడలింపులతో క్రికెట్ ఫ్యాన్స్లో ఉత్సాహం పెరిగింది..! ప్రతి ఏడాది ఈ టైమ్లో ఐపీఎల్ మ్యాచ్ల ఉత్కంఠలో తేలిపోయే సగటు అభిమాని.. ఇప్పుడు ఆ లీగ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు..! ఈ నేపథ్యంలో నిరవధికంగా వాయిదాపడిన ఐపీఎల్ను మళ్లీ లైవ్లోకి తీసుకొస్తారా..! ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు జరిపించే సాహసం బీసీసీఐ చేస్తుందా..! ఐపీఎల్ కోసం ఖాళీ విండో దొరుకుతుందా..! లేక నిరవధిక వాయిదాను కంటిన్యూ చేస్తారా..! క్రికెట్ బోర్డు పెద్దలు, ఫ్రాంచైజీల ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం..!!
వెలుగు స్పోర్ట్స్ డెస్క్
లాక్డౌన్ 4.0లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అతిపెద్ద రిలాక్సేషన్.. స్టేడియాలను తెరవడం. అయితే ఫ్యాన్స్ను అనుమతించబోమని స్పష్టంగా చెప్పినా.. ఎలాగో అలాగా క్రికెట్ జరిగితే బాగుండని అందరూ భావిస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా ఇళ్లకే పరిమితమైన క్రీడాభిమానులు.. ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి ఆటలు లేక బోర్గా ఫీలవుతున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఖాళీ స్టేడియాల్లోనైనా ఆటలు జరిగితే బాగుండని కోరుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటూ గేమ్స్ను రెజ్యూమ్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందులు తప్పవు. అయితే నాన్ కాంటాక్ట్ గేమ్స్కు సంబంధించి ట్రెయినింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నా.. దేశం మొత్తం ఊగిపోయే క్రికెట్కు మోక్షం ఎప్పుడు కలుగుతుందో చూడాలి. సెంట్రల్ ఇచ్చిన సడలింపుల్లో స్టేడియాలకు పర్మిషన్స్ ఉన్నా.. ఆటలు ఆడొచ్చా? లేదా? అనే దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఈనెల 31 వరకు లాక్డౌన్ పొడిగించినా.. తర్వాతి దశలోనైనా ఆటలకు పర్మిషన్ ఇస్తారా? ఈ ఒక్క సడలింపుతో దేశంలో క్రికెట్ను మొదలుపెట్టడం అసాధ్యమే అయినా.. కొంత మంది మాత్రం ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుందని బలంగా నమ్ముతున్నారు. గవర్నమెంట్ నిర్ణయాన్ని బీసీసీఐతో పాటు కొన్ని ఫ్రాంచైజీలు కూడా స్వాగతించాయి. అంటే ధనాధన్ లీగ్ గురించి కొద్దిగా ఆలోచన మొదలైనట్లుగానే భావించాలి.
ట్రావెల్ రిస్ట్రిక్షన్తోనే ఇబ్బంది
స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఓపెన్ చేసినా.. ఐపీఎల్ ప్లానింగ్కు మాత్రం ఇంకొంత కాలం వేచి చూడాలని బీసీసీఐ భావిస్తోంది. మెడికిల్ సర్వీసులు, ఎయిర్ అంబులెన్స్లు, సెక్యూరిటీ సంబంధిత అవసరాల కోసం తప్ప డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులు ప్రస్తుతం పనిచేయడం లేదు. కాబట్టి ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఎత్తేస్తే కానీ లీగ్ విషయంలో ముందడుగు వేయలేమని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ అన్నారు. కనీసం ఇంటర్ స్టేట్ ట్రావెలింగ్కు కూడా పర్మిషన్ లేకపోవడంతో ఐపీఎల్ గురించి ఇప్పుడే ఆలోచించడం తొందరపాటు చర్య అవుతుందన్నాడు. ‘ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఎత్తేసిన తర్వాతే క్రికెట్తో పాటు దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయి స్పోర్టింగ్ యాక్టివిటీ మొదలవుతుంది. ఈ నెలాఖరు వరకు దేశ వ్యాప్తంగా ట్రావెలింగ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందువల్ల కాంట్రాక్టు ప్లేయర్లకు ఇద్దామనుకున్న స్కిల్ బేస్డ్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ విషయంలోనూ వేచి చూస్తున్నాం. గవర్నమెంట్ గైడ్లైన్స్ వచ్చేదాకా ఆగుతాం. అథ్లెట్లు, సపోర్ట్ స్టాఫ్ ఆరోగ్యం, సంక్షేమానికే బోర్డు ప్రాధాన్యత ఇస్తుంది. లీగ్ కోసం తొందరపడి నిర్ణయాలు తీసుకోము. ముఖ్యంగా కరోనా వ్యాప్తికి ఇండియా చేస్తోన్న పోరాటానికి ఎట్టి పరిస్థితుల్లో ఆటంకంగా మారడం మాకు ఇష్టం లేదు’ అని ధుమాల్ స్పష్టం చేశారు.
ఫారిన్ క్రికెటర్లు రావాలి
ఇండియాలో చాలామంది స్టార్ క్రికెటర్లున్నా.. ఐపీఎల్కు ఫారిన్ క్రికెటర్లు మెయిన్ అట్రాక్షన్. వాళ్లు లేకపోతే లీగ్కు ఉన్న ఆదరణ కూడా దెబ్బతింటుంది. ఫారిన్ క్రికెటర్లు ఇండియాకు రావాలంటే ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు. లీగ్ ఫ్యూచర్ డిసైడ్ చేయాలంటే ఇలాంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలని అరుణ్ ధుమాల్ అన్నారు. ‘ట్రావెల్ రిస్ట్రిక్షన్ తొలిగిపోయినా.. మరో పెద్ద సమస్య ఖాళీ విండో దొరకడం. ఇప్పుడు ఇండియాలో ఐపీఎల్ సీజన్ దాదాపుగా అయిపోయినట్లే. షార్ట్ లీగ్ నిర్వహించే చాన్స్ కూడా లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఓ విండో కోసం వెతకాలి. దానికి ఐసీసీ ఒప్పుకోవాలి. ఇవన్నీ జరిగినా ఇండియాలో స్టేట్స్ గైడ్లైన్స్ను కూడా మేం ఫాలో కావాలి. చాలా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. అక్కడి ప్రభుత్వాలు మ్యాచ్లకు ఒప్పుకుంటాయో లేదో చూడాలి. ఇవన్నీ ఓ కొలిక్కి వస్తేగానీ లీగ్పై స్పష్టత రాదు’ అని ధుమాల్ వ్యాఖ్యానించాడు. ఇక ఫ్రాంచైజీలు కూడా బీసీసీఐ బాటనే అనుసరిస్తున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం బీసీసీఐ ప్రోగ్రామ్స్ను కచ్చితంగా ప్రభావితం చేస్తుందని ఓ ఫ్రాంచైజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అన్నారు.

