- కోహ్లీ, పంత్ ధనాధన్.. భువీ మ్యాజిక్
- టీ20ల్లో ఇండియాకు ఇది వందో విక్టరీ
- 2 - 0తో సిరీస్ కైవసం
- పోరాడి ఓడిన వెస్టిండీస్
కోల్ కతా: విమర్శలకు చెక్ పెడుతూ కింగ్ విరాట్ కోహ్లీ ( 41 బాల్స్ లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 52) ఫిఫ్టీతో ఫామ్లోకి వచ్చాడు. రిషబ్ పంత్ (28 బాల్స్ లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 52 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్తో దంచాడు. వీళ్లకు తోడు పేసర్ భువనేశ్వర్ కుమార్ (1/29) తన కెరీర్ను కాపాడుకునే స్పెల్తో మ్యాజిక్ చేయడంతో వెస్టిండీస్తో శుక్రవారం జరిగిన సెకండ్ టీ20లో టీమిండియా 8 రన్స్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. దాంతో, మూడు మ్యాచ్ల సిరీస్ను మరోటి మిగిలుండగానే 2-–0తో కైవసం చేసుకుంది. లాస్ట్ ఓవర్ వరకూ థ్రిల్లింగ్గా సాగిన ఈ పోరులో తొలుత ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 రన్స్ చేసింది. కోహ్లీ, పంత్ తో పాటు ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (18 బాల్స్ లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 33) రాణించాడు. అనంతరం ఛేజింగ్లో ఓవర్లన్నీ ఆడిన విండీస్ 178/3 రన్స్ మాత్రమే చేసి ఓడింది. పావెల్ ( 36 బాల్స్ లో 4 పోర్లు, 5 సిక్సర్లతో 68), నికోలస్ పూరన్ (41 బాల్స్ లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 62) దంచినా ఆ టీమ్కు ఓటమి తప్పలేదు. భువీతో పాటు ఇండియా స్పిన్నర్లు రవి బిష్ణోయ్ (1/30), చహల్ (1/31) చెరో వికెట్ తీశారు. పంత్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్లో చివరి, మూడో టీ20 ఆదివారం జరుగుతుంది.
పూరన్, పావెల్ వణికించినా..
భారీ టార్గెట్తో బరిలోకి దిగిన విండీస్కు ఓపెనర్లు బ్రెండన్ (22), మేయర్స్(9) ఐదు ఓవర్లో 34 రన్స్ అందించారు. కానీ, ఆరో ఓవర్లో చహల్ ఓ గూగ్లీతో మేయర్స్ను ఔట్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన పూరన్ .. బౌలింగ్లో 6, 4 తో ఇన్నింగ్స్ కు ఊపు తీసుకొచ్చాడు. స్పిన్నర్ బిష్ణోయ్.. బ్రెండన్ను పెవిలియన్ చేర్చగా..పూరన్కు పావెల్ తోడయ్యాడు. ఈ ఇద్దరూ భారీ షాట్లతో బౌలర్లను ఎటాక్ చేశారు. ఇండియా ఫీల్డర్లు క్యాచ్లు డ్రాప్ చేయడం కూడా వీళ్లకు కలిసొచ్చింది. దీపక్ బౌలింగ్లో ఇద్దరూ చెరో సిక్స్ బాదగా.. 17 ఓవర్లకు విండీస్ 150/2తో నిలిచింది. లాస్ట్ 18 బాల్స్లో 37 రన్స్ అవసరం అవగా పావెల్, పూరన్ జోరు చూస్తే విండీస్కే మొగ్గు కనిపించింది. కానీ, 18వ ఓవర్లో హర్షల్ 8 రన్స్ ఇవ్వగా.. 19 ఓవర్లో భువనేశ్వర్ మ్యాజిక్ చేశాడు. పూరన్ను ఔట్ చేసి 4 రన్సే ఇచ్చి మ్యాచ్ను టర్న్ చేశాడు. హర్షల్ వేసిన లాస్ట్ ఓవర్లో 3, 4 బాల్స్కు పావెల్ సిక్సర్లు కొట్టినా చివరి రెండు బాల్స్కు సింగిల్స్ మాత్రమే రావడంతో ఇండియానే గెలిచింది.
విరాట్, రిషబ్ ఫిఫ్టీలు
కోహ్లీ, పంత్ మెరుపులతో ఇండియా మంచి స్కోరే చేసింది. అయితే, టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్కు వచ్చిన టీమ్కు రెండో ఓవర్లోనే ఓపెనర్ ఇషాన్ కిషన్ (2) వికెట్ కోల్పోయింది. కాట్రెల్ బౌలింగ్లో తను మేయర్స్కు క్యాచ్ ఇచ్చాడు. అయితే, వన్డౌన్లో వచ్చిన కోహ్లీ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో కనిపించాడు. థర్డ్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. ఆపై, షెఫర్డ్ వేసిన ఔట్ స్వింగర్ ను ఔట్ సైడ్ ఆఫ్ మీదుగా, రెండో బంతిని మిడాన్ మీదుగా ఫోర్లుగా మలిచి వింటేజ్ కోహ్లీని తలపించాడు. మరో ఎండ్ లో రోహిత్ శర్మ (19) సిక్స్తో స్పీడు పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, రోస్టన్ చేజ్ వరుస ఓవర్లలో రెండు వికెట్లతో ఇండియాను ఒత్తిడిలోకి నెట్టాడు. భారీ షాట్కు ట్రై చేసిన రోహిత్.. బ్రెండన్ కు క్యాచ్ఇవ్వగా, పదో ఓవర్లో సూర్యకుమార్ (8)ను చేజ్ అద్భుత రిటర్న్ క్యాచ్తో ఔట్ చేశాడు. ఈ దశలో పంత్, కోహ్లీ బాధ్యత తీసుకున్నారు. వరుసగా బౌండ్రీలు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే చేజ్ వేసిన14వ ఓవర్లో సిక్స్ కొట్టి కోహ్లీ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కానీ అదే ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. అయినా వెనక్కు తగ్గని పంత్.. పొలార్డ్ వేసిన 15వ ఓవర్లో మూడు ఫోర్లతో గేరు మార్చాడు. మరోఎండ్లో వెంకటేశ్ కూడా భారీ షాట్లు ఆడాడు. 19వ ఓవర్లో హోల్డర్ బౌలింగ్ లో టాస్ బాల్ను పంత్ మిడ్ వికెట్ మీదుగా కొట్టిన సిక్స్ ఇన్నింగ్స్కే హైలైట్. చివరి 8 ఓవర్లలో ఇండియా 98 రన్స్ రాబట్టడం విశేషం. విండీస్ బౌలర్లలో చేజ్ (3/25) 3 వికెట్లు పడగొట్టాడు.
స్కోర్స్
ఇండియా: 20 ఓవర్లలో 186/5 (కోహ్లీ 52, పంత్ 52*, చేజ్ 3/25).
వెస్టిండీస్: 20 ఓవర్లలో 178/3 (పావెల్ 68*, పూరన్ 62, భువనేశ్వర్ 1/29)