Koratala Siva: శ్రీమంతుడు కథ కాపీ వివాదం..కొరటాల క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిందే: సుప్రీంకోర్టు

 Koratala Siva: శ్రీమంతుడు కథ కాపీ వివాదం..కొరటాల క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిందే: సుప్రీంకోర్టు

మహేశ్‌‌ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు (Srimanthudu) సినిమాకు సంబంధించి కాపీ రైట్‌‌ యాక్ట్ కింద డైరెక్టర్‌‌‌‌ కొరటాల శివ(Koratala Siva)కు..తాజాగా సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. నాంపల్లి సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కచ్చితంగా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిందే అని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ఇలాంటి వ్యవహారాలపై విచారణను ఎదుర్కోవాలి అయితే..ఈ వ్యవహారంతో నిర్మాతకు సంబంధం లేదని సుప్రీంకోర్టు తెలిపింది.

‘శ్రీమంతుడు’ స్టోరీని స్వాతి మ్యాగజైన్లో ప్రచురించిన కథ ఆధారంగా కాపీ చేశారని..రచయిత శరత్‌ చంద్ర గతంలో హైదరాబాద్‌ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు డైరెక్టర్ కొరటాల శివపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ, కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

శ్రీమంతుడు వివాదం..అసలేం జరిగింది

శ్రీమంతుడు సినిమాకు సంబంధించి కాపీ రైట్‌‌ యాక్ట్ కింద మొదలైన వివాదం డైరెక్టర్ కొరటాల శివ చాలా రోజుల నుంచి ఎదుర్కొంటున్నారు. నిర్మాత ఎర్నేని రవి, ఎంబీ ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌లపై కాపీ రైట్‌‌యాక్ట్‌‌ కేసుతో పాటు ఫోర్జరీ, చీటింగ్‌‌ కేసులు నమోదు చేయాలన్న కథ రచయిత శరత్‌‌ చంద్ర (ఆర్డీ విల్సన్‌‌) అభ్యర్థనను హైకోర్టులో పెట్టుకున్నారు. కానీ తమ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

'చచ్చేంత ప్రేమ’ పేరిట తాను రాసిన నవలలో స్వల్ప మార్పులు చేసి శ్రీమంతుడు పేరిట సినిమా తీశారంటూ ఆ మూవీ డైరెక్టర్‌‌‌‌ కొరటాల శివ, నిర్మాతలు ఎర్నేని రవి, ఎంబీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్లపై రచయిత శరత్‌‌ చంద్ర క్రిమినల్‌‌ కేసు పెట్టారు. దీనిని సవాల్‌‌ చేస్తూ ఆ ముగ్గురూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో కాపీ రైట్‌‌ యాక్ట్ కింద డైరెక్టర్‌‌‌‌ కొరటాల శివ విచారణ ఎదుర్కోవాల్సిందేనని హై కోర్టు గతంలో తేల్చి చెప్పింది.

ఇదే సమయంలో వారిపై చీటింగ్, ఫోర్జరీ కేసుల నమోదుకు ఉత్తర్వులివ్వాలని శరత్‌‌చంద్ర తన పిటిషన్‌‌లో కోరారు. ‘‘శ్రీమంతుడు కథలో స్వల్ప మార్పులు ఉన్నాయని 8 మంది రచయితల కమిటీ చెప్పింది. దీంతో డైరెక్టర్‌‌‌‌ కాపీ రైట్‌‌ యాక్ట్‌‌ నిబంధనల ప్రకారం విచారణను ఎదుర్కోవాలి.

ఎందుకంటే, దర్శకుడే కథా రచయతకు, స్రీన్‌‌ప్లేకు సొమ్ము చెల్లించారు. కథనంలో మార్పులు చేసి తన కథ అంటే కుదరదు. ఇలాంటి వ్యవహారాలపై విచారణను ఎదుర్కోవాలి. ఈ వ్యవహారంతో నిర్మాతకు సంబంధం లేదు. ఇదే సమయంలో దర్శకుడు, నిర్మాత, ఎంటర్‌‌టైన్‌‌మెంట్ సంస్థలపై చీటింగ్, ఫోర్జరీ కేసులు చెల్లవు” అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.