
వాతావరణం చల్లగా మారిపోయింది. ఇలాంటప్పుడు కాస్త వేడిగా, కారంగా ఏదైనా తినాలనిపిస్తుంటుంది. దాంతో బయటకు వెళ్లి కంటికి కనిపించినవన్నీ ట్రై చేస్తుంటారు. అయితే ఈసారి ఆ టేస్టీ ఫుడ్ని ఇంట్లోనే ట్రై చేయండి. చాలా సులభంగా, ఎంతో రుచిగా ఉండే శ్నాక్స్ పనీర్తో చేసుకోండి. రుచిని ఆస్వాదిస్తూనే ఆరోగ్యంగా ఉండండి.
చిల్లీ బాంబ్
కావాల్సినవి :
- పనీర్ - 200 గ్రాములు
- నూనె, ఉప్పు - సరిపడా
- వెల్లుల్లి, అల్లం తరుగు, సోయాసాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఉల్లికాడలు - ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర, టొమాటో కెచెప్, కార్న్ ఫ్లోర్ - ఒక్కో టేబుల్ స్పూన్, ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ - ఒక్కోటి
- పచ్చిమిర్చి - నాలుగు
తయారీ :
పాన్లో నూనె వేడి చేసి అందులో వెల్లుల్లి, అల్లం, ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, పనీర్ తరుగు వేసి వేగించాలి. తర్వాత అందులో సోయాసాస్, గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో కెచెప్ వేసి కలపాలి. కాసేపటి తర్వాత కార్న్ ఫ్లోర్, ఉప్పు, ఉల్లికాడలు వేసి కలపాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని కాస్త చల్లారనివ్వాలి. బ్రెడ్ ముక్కల చివర్లు కట్ చేసి నీళ్లలో ఒకసారి ముంచి తీసి, అరచేతిలో అదమాలి. ఆ బ్రెడ్ స్లైస్లో రెడీ చేసుకున్న స్టఫింగ్ పెట్టి ఉండలా చుట్టాలి. తర్వాత దాన్ని కార్న్ ఫ్లోర్లో దొర్లించాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పనీర్ బాంబ్స్ను వేడి నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగించాలి. ఈ క్రిస్పీ పనీర్ బాంబ్స్ తినే కొద్దీ తినాలనిపిస్తాయి.
కుర్ కురే
కావాల్సినవి :
- పనీర్ - పావు కిలో, ఉప్పు, కార్న్ ఫ్లేక్స్ - సరిపడా
- పసుపు, కారం, చాట్ మసాలా, కసూరీ మేథి, వాము - అర టీస్పూన్ చొప్పున, కొత్తిమీర - కొంచెం, శనగపిండి - ఒక కప్పు
తయారీ :
పొడవుగా కట్ చేసిన పనీర్ ముక్కలపై ఉప్పు చల్లాలి. తర్వాత పావు టీస్పూన్ చొప్పున పసుపు, కారం, చాట్ మసాలా, కసూరీ మేథి వేసి కలిపి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో శనగపిండి, వాము, కొత్తిమీర, మిగిలిన పసుపు, కారం, చాట్ మసాలా, కసూరీ మేథి వేసి నీళ్లు పోసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని పనీర్ ముక్కలపై పోయాలి. తర్వాత వాటిని కార్న్ ఫ్లేక్స్లో దొర్లించి నూనెలో వేగించాలి. చల్లారాక కెచెప్తో తింటే పనీర్ కుర్ కురే
కరకరలాడుతూ భలే ఉంటుంది.
కట్లెట్
కావాల్సినవి :
- పనీర్ - 300 గ్రాములు
- ఆలుగడ్డ (ఉడికించి) - ఒకటి
- ఉల్లిగడ్డ - ఒకటి, కొత్తిమీర - కొంచెం, చాట్ మసాలా, గరం మసాలా - అర టీస్పూన్ చొప్పున, అల్లం - చిన్న ముక్క
- క్యాబేజీ తరుగు, బ్రెడ్ క్రంబ్స్ - ఒక్కో కప్పు, క్యాప్సికమ్, క్యారెట్ తరుగు - అర కప్పు చొప్పున, పచ్చిమిర్చి - రెండు, కార్న్ ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు, శనగ పిండి - నాలుగు టేబుల్ స్పూన్లు, ఆమ్చూర్ పొడి - పావు టీస్పూన్, నూనె, ఉప్పు - సరిపడా
తయారీ :
పాన్లో నూనె వేడి చేసి అందులో అల్లం తురుము, ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, క్యాబేజీ తరుగు వేసి వేగించి పక్కన పెట్టాలి. తర్వాత ఒక గిన్నెలో పనీర్, ఉడికించిన ఆలుగడ్డ ముద్ద, గరం మసాలా, చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర తరుగు, ఉప్పు, వేగించి పెట్టుకున్న వెజిటబుల్ మిక్స్ కూడా వేసి బాగా కలపాలి. ముద్దగా అయిన తర్వాత చిన్న ఉండలు చేసి కట్లెట్ ఆకారంలో వత్తాలి. మరో చిన్న గిన్నెలో శనగ పిండి, ఉప్పు వేసి నీళ్లు పోసి కలపాలి. ఆ మిశ్రమంలో కట్లెట్లను ముంచి, తర్వాత బ్రెడ్ క్రంబ్స్లో దొర్లించాలి. మరో పాన్లో నూనె వేడి చేసి అందులో వేసి వేగించాలి. ఇవి బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండి ఎంతో రుచికరంగా ఉంటాయి.