
చిప్స్, చాక్లెట్లు, బిస్కెట్లు జంక్ ఫుడ్ కనిపిస్తే చాలు చిన్న పిల్లలు లొట్టలేసుకుని తింటారు. ఎంత చెప్పినా వినరు. కొనిచ్చే వరకు వదలరు. ఏడిచైనా సరే సాధించుకుంటారు. రేట్లు ఎలా ఉన్నా పిల్లలకు కొనిస్తారు తల్లిదండ్రులు. చివరకు అనారోగ్యం బారిన పడుతుంటారు. అయితే ఇటీవల కేంద్రం జీఎస్టీ స్లాబుల్లో మార్పులతో సెప్టెంబర్ 22 నుంచి వీటి ధర ఇంకా తగ్గనుంది. ఎగ్జాంపుల్ 12 రూపాయలకు వచ్చే బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలకే వస్తోంది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలను ఎక్కువగా తినే వాటిపైన జీఎస్టీ రేట్లు తగ్గించడం వల్ల ఆరోగ్యం ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పలువురు విమర్శిస్తున్నారు.
జీఎస్టీ తగ్గింపుపై విమర్శలు..
పిల్లల్లో ఒబెసిటీ సమస్య తగ్గించడానికి యునిసెఫ్ పలు చూచనలు చేసింది. అధిక షుగర్, సాల్ట్, ఫ్యాట్ కలిగిన ఆహార పదార్థాలపై పన్నులు ఎక్కువగా విధించాలని సూచించింది. అలాగే, స్కూళ్లలో జంక్ఫుడ్ అమ్మకాలు నిషేధించాలని, ఫుడ్ లేబులింగ్ తప్పనిసరి చేయాలని ఆయా దేశాలను కోరింది. ఆరోగ్యకరమైన ఆహారాలకు సబ్సిడీలు, సోషల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని పేర్కొంది. అయితే, ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం భారీ సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సంస్కరణల్లో భాగంగా ఒబెసిటీకి కారణమయ్యే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్పై జీఎస్టీ తగ్గించాలని ప్రతిపాదనలు చేశారు. ఆయా ఫుడ్ ప్రొడక్ట్స్పై 18, 12 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గించాలని ప్రతిపాదించారు. ఈ సవరణలు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ఈ నిర్ణయంపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చిప్స్, బిస్కెట్లు, కూల్ డ్రిక్స్లాంటి ప్యాకెట్లలో దొరికే అనారోగ్యకరమైన ఆహారం మీద జీఎస్టీని తగ్గిస్తే ఆ వస్తువుల ధరలు మార్కెట్లో తగ్గుతాయి. రూ. 10కి దొరికే చిప్స్ ప్యాకెట్ రూ.8కే వస్తుంది. పిల్లలు, యువత వాటిని ఇంకా ఎక్కువగా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది పిల్లల్లో ఒబెసిటీ, గుండె, క్యాన్సర్, డయాబెటిస్లాంటి అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఒకవైపు ప్రభుత్వం పోషణ్ అభియాన్లాంటి స్కీమ్స్ద్వారా పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. మరోవైపు ఒబెసిటీని పెంచే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్పై జీఎస్టీ తగ్గిస్తే.. ఆ ఖర్చు బూడిదలో పోసిన పన్నీరే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.