కొమురవెల్లిలో భక్తుల సందడి

కొమురవెల్లిలో భక్తుల సందడి

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో భక్తులు ఎక్కువగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు కోనేరులో స్నానం చేసి స్వామివారికి పట్నాలు వేసి, బోనం సమర్పించి, గంగరేగు చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండపైన రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. 

గదుల నిర్మాణానికి రూ.15 లక్షల విరాళం

ఆలయ పరిధిలో నిర్మించే కాటేజీలకు మంచిర్యాలకు చెందిన కామారపు మహేందర్, రవీందర్ వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.15 లక్షలు విరాళం ఇచ్చారు. మల్లికార్జున స్వామిని ఎస్పీ అన్నపూర్ణతో పాటు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రసాదం అందజేసి స్వామివారి ఫొటోను బహూకరించి సన్మానం చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ రాజు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.