
హైదరాబాద్, వెలుగు: జూన్ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని 6 లక్షల మంది ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు చెల్లించాలని సీఎస్రామకృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వచ్చే నెలలో పాఠశాలలు తెరిచిన వెంటనే విద్యార్థుల ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాలకు లింక్చేసి వారికి డెబిట్ కార్డులు మంజూరు చేయించాలని సూచించారు.
రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీల చెల్లింపులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానంపై సీఎస్రామకృష్ణా రావు బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ చెల్లింపుల కోసం తక్షణమే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా ఈ చెల్లింపులు జరిగేలా కార్యక్రమం రూపొందించాలని అధికారులకు సీఎస్ సూచించారు.