
హైదరాబాద్, వెలుగు : పబ్లిక్ గార్డెన్స్ లో ఈ నెల 26న నిర్వహించనున్న రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లపై సీఎస్శాంతి కుమారి బుధవారం డా.బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడారు. రిపబ్లిక్ డే వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. పబ్లిక్ గార్డెన్స్ లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని సీఎస్ తెలిపారు.
ఈ నేపథ్యంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేసి, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. రాజ్భవన్, సచివాలయం, శాసనసభ, హైకోర్టు తదితర అన్ని ముఖ్యమైన ప్రభుత్వ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆర్ అండ్ బి శాఖకు ఆదేశాలు ఇచ్చారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. పబ్లిక్ గార్డెన్స్ లో అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్ ను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్రావు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, పోలీస్, డిఫెన్స్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.