ఈదురుగాలులకు తెగిపడిన కరెంట్ ​వైర్లు

ఈదురుగాలులకు తెగిపడిన కరెంట్ ​వైర్లు
  • షాక్​తో తల్లీకూతుళ్లు మృతి
  • తలుపుపై పడడంతో కరెంట్​ షాక్​ 
  • మృతులిద్దరూ బట్టీ కార్మికులు 
  • కరీంనగర్‌‌ జిల్లా చింతకుంట శివారులో ఘటన

కొత్తపల్లి, వెలుగు : కరీంనగర్‌‌ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట శివారులోని ఇటుక బట్టీలో పనిచేస్తున్న తల్లీకూతుళ్లు కరెంట్​ షాక్​తో చనిపోయారు. ఎస్సై సాంబమూర్తి కథనం ప్రకారం..ఒడిశా రాష్ట్రం నవరంగ్​పూర్​ జిల్లా పక్కన్​గూడకు చెందిన విద్యాదర్​ బిందానికి ఇద్దరు భార్యలు.  పెద్ద భార్య బేని (36), కూతురు బాబి (18), కొడుకు దశరథ్​తో కలిసి చింతకుంట శివారులోని లక్ష్మి బ్రిక్స్​ కంపెనీలో పనిచేస్తోంది. 

విద్యాదర్​ చిన్న భార్య సృశితో కలిసి పక్కనే ఉన్న మరో ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి విద్యాదర్ ​ పెద్ద భార్య బేని, కూతురు బాబి నిద్రపోగా, రాత్రి ఈదురుగాలులు వచ్చాయి. కరెంట్​ వైర్లు తెగి ఇంటి తలుపుపై పడ్డాయి. గురువారం తెల్లవారుజామున తోటి కార్మికుడు జగన్నాథ్..బేనిని నిద్ర లేపడానికి వెళ్లి తలుపు ​కొట్టగా ​షాక్ కొట్టింది. దీంతో విద్యాదర్​కు సమాచారం ఇవ్వగా అతడు వచ్చి కరెంట్​ వైరును తప్పించి డోర్​ తెరిచి చూడగా బేని, బాబి చనిపోయి ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై 
తెలిపారు. 

జమ్మికుంటలో రైతు..  

జమ్మికుంట : కరీంనగర్‌‌ జిల్లా జమ్మికుంట మండలంలో సర్వీస్‌ వైర్‌‌ సరిచేస్తుండగా షాక్‌ కొట్టి రైతు చనిపోయాడు. విలాసాగర్ కు చెందిన వేల్పుల శ్రీనివాస్(43) రైతు. బుధవారం అర్ధరాత్రి వర్షంతోపాటు గాలి దుమారం రాగా ఇంటివద్ద సర్వీస్‌ వైర్‌‌ తెగి కిందపడింది. తెల్లవారిన తర్వాత ఆ వైరును కర్రతో సరిచేస్తుండగా11కేవీ వైర్‌‌ తాకి షాక్​ కొట్టింది. దీంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉండగా, ఇటీవల పెద్దకూతురికి పెండ్లి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.