కూసుమంచి, వెలుగు : పెన్సిల్ గొంతులో గుచ్చుకోవడంతో ఓ స్టూడెంట్ చనిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెం గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలోని మేడవరపు ఉపేంద్రచారి, మౌనిక దంపతుల పెద్ద కుమారుడు విహార్ (8) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు.
బుధవారం మధ్యాహ్నం తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో అతడి జేబులో ఉన్న పెన్సిల్ గొంతులో గుచ్చుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు టీచర్స్కు సమాచారం ఇవ్వడంతో బాలుడిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. బాలుడు తండ్రి ఉపేంద్రాచారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
