సీజనల్ ఫ్రూట్స్ అనగానే ఎండాకాలంలో మామిడి, చలికాలంలో సీతాఫలాలు మొదటగా గుర్తొచ్చేవి. అయితే ఈ సారి వానకాలం గడిచిపోవడానికి ఇంకా చాలా టైమే ఉండగా కాస్త ముందుగానే సీతాఫలాలు మార్కెట్లోకి దిగాయి.
పండ్ల లోడ్తో ఉన్న లారీలు హైదరాబాద్లోని వివిధ మార్కెట్లకి తరలి వస్తున్నాయి. కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న వనపర్తి, మహబూబ్నగర్, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో ఈ చెట్లు ఎక్కువగా ఉన్నాయి.
కాస్త ముందుగానే పక్వానికి వచ్చిన పళ్లను రైతులు ఎప్పటికప్పుడు నగరాలకి సరఫరా చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా గిరాకీ ఎక్కువగా ఉండటంతో ధర ఎంతైనా సరే వెచ్చించి తీసుకోవడానికి వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పటికే పురానాపూల్, తాడ్బన్, ఎర్రగడ్డ, మెహదీపట్నం, చాదర్ఘాట్, ఎల్బీనగర్, ఫలక్నుమా తదితర ప్రాంతాల్లోని చిరు వ్యాపారులు గిరిజనుల నుంచి తెచ్చిన పండ్లను అమ్మడం స్టార్ట్ చేశారు. గిరిజనులు అటవీ ప్రాంతాల నుంచి పండ్లను సేకరించి నగరానికి తీసుకువస్తున్నారు.
కిలో సీతాఫలాల ధర రూ. 200 నుంచి రూ. 300 గా ఉంది. రానున్న రోజుల్లో మార్కెట్లోకి పండ్లు పుష్కలంగా వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఫ్రూట్స్సీజన్ నవంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు.