మేడారం మహాజాతరకు 6 వేల ఆర్టీసీ బస్సులు: సజ్జనార్

మేడారం మహాజాతరకు 6 వేల ఆర్టీసీ బస్సులు: సజ్జనార్

వరంగల్: మేడారం మహాజాతరకు వచ్చే భక్తులు కోళ్లు, మేకలను తీసుకొస్తే ఆర్టీసీ బస్సుల్లో ఎక్కేందుకు అనుమతించబోమన్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ సీవీ సజ్జనార్. ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం వరంగల్ లోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో మేడారం మహాజాతరపై ఆర్టీసీ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎండీ వీసీ సజ్జనార్ .. మేడారం జాతరలో విధులు నిర్వర్తించే టీఎస్ఆర్టీసీ సిబ్బంది కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో రూపొందించిన టీ షర్ట్ లను ఆవిష్కరించారు.

అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ..   మేడారం మహాజాతరకు 6 వేల బస్సులను సిద్ధం చేశామని తెలిపారు. మొత్తం15వేల మంది ఆర్టీసీ సిబ్బంది జాతర విధుల్లో ఉంటారని చెప్పారు. తెలంగాణలోని 51 పాయింట్ల నుంచి బస్సులు నడిపిస్తున్నామని  తెలిపారు. జాతర బస్సుల్లో కోళ్లు, మేకలకు అనుమతి లేదని ఆయన చెప్పారు. ఈసారి జాతరకు రెండువేల బస్సులను అదనంగా నడుపుతున్నామని.. జాతర బస్సులకు సాదారణ చార్జీలే తీసుకుంటామని సజ్జనార్ వెల్లడించారు.