
- కేవలం 24 శాతం కంపెనీలే రెడీ
- వెల్లడించిన సిస్కో స్టడీ
జైపూర్: సైబర్ దాడులను తట్టుకునే విషయంలో ఇండియా కంపెనీలు చాలా బలహీనంగా ఉన్నాయని తాజా స్టడీ ద్వారా వెల్లడయింది. ఇండియాలో 24 శాతం సంస్థల దగ్గర మాత్రమే ఆధునిక సైబర్ సెక్యూరిటీ రిస్క్లను ఎదుర్కొనేందుకు అవసరమైన టెక్నాలజీలు, సాఫ్ట్వేర్లు ఉన్నాయని సిస్కో తాజా రిపోర్టు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఇండియా అంతటా రాబోయే మూడేళ్లలో ఐదు లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులకు శిక్షణ ఇస్తామని ప్రకటించింది. గ్లోబల్ బిజినెస్ సెక్యూరిటీ లీడర్లు తగిన చర్యలు తీసుకోకపోతే సైబర్సెక్యూరిటీ దెబ్బతింటుందని సిస్కో సైబర్ సెక్యూరిటీ రెడీనెస్ ఇండెక్స్ స్పష్టం చేసింది.
ఇందులోని వివరాల ప్రకారం.. సైబర్ దాడులను ఎదుర్కోవడానికి రెడీ కావడంచాలా ముఖ్యం. స్టడీలో పాల్గొన్నవారిలో 90 శాతం మంది రెస్పాండెంట్లు వచ్చే 12 నుంచి 24 నెలల్లో తమ వ్యాపారానికి సైబర్ సెక్యూరిటీ దాడులు ఎదురవుతాయని భయపడుతున్నారు. సైబర్ సెక్యూరిటీ రెడీనెస్ విషయంలో ప్రపంచ సగటుతో పోలిస్తే ఇండియా 15 శాతానికిపైగా మెరుగైన పనితీరు కనబరిచింది. ఈ సర్వే ద్వారా 27 మార్కెట్లలోని 6,700 మంది ప్రైవేట్ రంగ సైబర్ సెక్యూరిటీ లీడర్ల అభిప్రాయాలను తీసుకున్నారు. ఇండియాలోని సంస్థలు గ్లోబల్ యావరేజ్ కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ, వీటికి రిస్క్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే 80 శాతం మంది రెస్పాండెంట్లు తమ కంప్యూటర్లపై గత 12 నెలల్లో సైబర్ సెక్యూరిటీ దాడి జరిగిందని చెప్పారు. దీని వలన తమకు కనీసం 500,000 డాలర్లు ఖర్చయిందని 53 శాతం మంది తెలిపారు. రెస్పాండెంట్లలో 95 శాతం మంది తమ భద్రతా బడ్జెట్లను రాబోయే 12 నెలల్లో కనీసం 10 శాతం పెంచాలని భావిస్తున్నారు.