- ఫంక్షన్లలో మహిళల ఫోన్ నంబర్స్ తీసుకుని వేధింపులు
- ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్స్లో ఫోన్ నంబర్ల అప్ లోడ్
- పాత నేరస్తుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్,వెలుగు: ఫంక్షన్లలో క్యాటరింగ్ చేస్తూ ఫోన్ నంబర్లు తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్న పాత నేరస్తుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మహిళల ఫోన్ నంబర్స్ తీసుకుని కాల్గల్స్గా ఫేస్ బుక్లో ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. శనివారం డీసీపీ కవిత మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏపీలోని అనంతపూర్ జిల్లాకు చెందిన ఉన్నూరు స్వామి(34) యూసుఫ్గూడలో ఉంటున్నాడు. జస్ట్ డయల్లో క్యాటరింగ్ సప్లయర్గా రిజిస్టర్ చేసుకున్నాడు. ఫంక్షన్ హాల్స్, రెస్టారెంట్స్లో జరిగే ఈవెంట్స్కు క్యాటరింగ్బాయ్స్ను సప్లయ్ చేస్తామని పాంప్లెట్స్, పోస్టర్స్ అంటించేవాడు. క్యాటరింగ్ బాయ్స్ను కూడా సప్లయ్ చేసేవాడు. ముందుగా ఒక్కో వ్యక్తికి రూ.500 చొప్పున చార్జ్ చేసేవాడు.
కాల్గర్ల్స్గా ఫోన్ నంబర్స్ అప్ లోడ్
ఫంక్షన్ ముగిసిన తర్వాత ఎక్కువ డబ్బు డిమాండ్ చేసేవాడు. ముందుగా ఫంక్షన్ నిర్వాహకుల కుటుంబ సభ్యుల మహిళల ఫోన్ నంబర్స్ తీసుకునేవాడు. తాను అడిగినంత డబ్బు ఇవ్వక పోతే మహిళల ఫోన్ నంబర్స్ కాల్ గల్స్ లిస్ట్లో అప్లోడ్ చేసేవాడు. ఫేక్ ప్రొఫైల్స్తో ఫేస్బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసేవాడు. ప్రాసిట్యూషన్ చేస్తున్నట్లు ప్రచారం చేసేవాడు. తను సేకరించిన ఫోన్ నంబర్స్ను పోస్ట్ చేసేవాడు. వారి ఫోన్ నంబర్స్ను పబ్లిక్ టాయిలెట్స్, మెట్రో పిల్లర్లపై కూడా అంటించేవాడు. దీంతో ఆయా నంబర్స్కి పెద్ద సంఖ్యలో కాల్స్ వచ్చేవి.
ఇలా దొరికాడు
సికింద్రాబాద్కు చెందిన ఓ ఫ్యామిలీ రిసెప్షన్ కు 13 మంది క్యాటరింగ్ బాయ్స్ను సప్లయ్ చేశాడు. ఒక్కొక్కరికి రూ.550 చొప్పున రూ.7,150 మాట్లాడుకున్నాడు. ఫంక్షన్ అయిన తర్వాత రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోవడంతో కాల్స్ చేసి వేధించాడు. ఫోన్ నంబర్స్ను కాల్గల్స్గా ఫేస్బుక్లో పోస్టింగ్ చేశాడు. దీంతో బాధితులకు గంటల వ్యవధిలో వందల సంఖ్యలో ఫోన్కాల్స్ వచ్చాయి. దీంతో భరించలేక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు.11 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు,30కి పైగా సెల్ ఫోన్స్ సిమ్ కార్డులు మార్చినట్లు గుర్తించారు.