
- మొన్న ఎస్బీఐ, నిన్న కిసాన్, నేడు ఆర్టీవో ఏపీకే ఫైల్స్
- వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాలతో టార్గెట్
- ములుగు జిల్లాలో 65కిపైగా కేసుల నమోదు
- సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలంటున్న పోలీసు అధికారులు
ములుగు, వెలుగు : సైబర్నేరగాళ్లు కొత్తదారుల్లో డబ్బులు కాజేస్తున్నారు. గతంలో ఎస్బీఐ, కిసాన్ సంస్థలను అడ్డం పెట్టుకొని ఏపీకే ఫైల్స్ క్రియేట్ చేసిన నేరగాళ్లు ప్రస్తుతం రవాణా శాఖను టార్గెట్ చేస్తున్నారు. వాట్సాప్ లలో డాట్ ఏపీకే ఫైల్స్ను క్రియేట్ చేసి మెస్సేజ్ పంపిస్తే, తెలియని వారు ఆ లింక్ లను క్లిక్ చేసి మోసపోతున్నారు. ప్రజలు అలెర్ట్గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
కొత్తగా ఆర్టీవో ఏపీకే తో చోరీలు..
గతంలో జరిగిన సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు సైబర్ క్రైం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. బ్యాంకులు ఓటీపీలు అడగవని, అలాంటి కాల్స్ వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా, సైబర్ నేరస్తులు కొత్తదారుల్లో టార్గెట్ చేస్తున్నారు. ఏపీకే ఫైల్స్, యాప్ల ద్వారా డబ్బులను కాజేస్తున్నారు.
దీంతో పీఎం కిసాన్ యోజన ఏపీకే, ఎస్బీఐ యాప్ల ద్వారా డబ్బులు కోల్పోతున్న వారు కంప్లెయింట్ చేయడంతో నేరగాళ్లు కొత్త విధానాన్ని అవలంభిస్తున్నారు. రోడ్ట్రాన్స్పోర్ట్శాఖ కు సంబంధించిన ఆర్టీవో ఏపీకే ఫైల్ ను వాట్సాప్ లో సెండ్ చేస్తూ హ్యాక్ చేస్తున్నారు. వాట్సాప్ ఓపెన్ చేయగానే ఆర్టీవో ఆఫీస్ జీవోవీటీ అని కనిపిస్తోంది.
అందులో ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం ద్వారా మీ వాహనంపై ట్రాఫిక్ చాలన్ ఇష్యూ అయ్యింది, చాలన్ నెంబర్ అంటూ ఒక నెంబర్ పంపిస్తున్నారు. అది నిజమేనేమో అనే సందేహం వచ్చేలా మెస్సేజ్వస్తోంది. ఈ లింక్ను ఓపెన్ చేస్తే ఖాతాలో డబ్బులు మాయం అవుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. ఫేస్బుక్లో అయితే ట్రేడ్ బిజినెస్ పేరిట ఆశ చూపి డబ్బులు లాగేస్తున్నారు.
ములుగు జిల్లాలో రెండేళ్లలో మొత్తం 65 సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయి. 2024లో రూ.20.86లక్షలు రికవరీ కాగా, 2025 జూన్ వరకు రూ.3.56 లక్షలు రిఫండ్ అయినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అందులో ఎక్కువ మొత్తంలో ఒక బాధితుడివి రూ.18లక్షలు, మరో బాధితుడివి రూ.34లక్షలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో కోల్పోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కంప్లెయింట్ ఆలస్యం చేయడంతో కేసులు దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించారు.
తెలియని మెస్సేజ్ లను డిలీట్ చేయాలి..
సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర మాధ్యమాల ద్వారా నేరగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నారు. ఏపీకే ఫైల్స్పై ఎవరూ క్లిక్చేయొద్దు. చదువుకున్న వారు, ఉద్యోగస్తులే టార్గెట్ గా నేరగాళ్లు చాట్ చేస్తున్నారు. ఒకవేళ డబ్బులు కోల్పోతే వెంటనే 1930 కు సమాచారం ఇవ్వాలి. ఆలస్యం అయితే రికవరీకి ఆస్కారం తక్కువగా ఉంటుంది. జిల్లాలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తాం. - బి.నందిరాం నాయక్, డీఎస్పీ, సైబర్ క్రైం, ములుగు
1930కి కాల్చేస్తే రికవరీకి ఛాన్స్..
సైబర్ వలలో చిక్కిన బాధితులు వెంటనే గుర్తించి నిమిషాల వ్యవధిలో టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులను సైబర్ క్రైం ఆఫీసర్లు హోల్డ్లో పెట్టే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తోంది. 1930కి కాల్ చేయగానే బాధితుడికి దగ్గర్లోని సైబర్ కార్యాలయాలకు కనెక్ట్ అవుతుంది.
వివరాలు నమోదు చేసుకోవడంతోపాటు కోల్పోయిన డబ్బులు ఏ బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్ఫర్ అయ్యాయో తనిఖీ చేస్తారు. ఆన్లైన్ ద్వారా ఆ అకౌంట్ ను హోల్డ్లో పెట్టి విచారణ మొదలు పెడతారు. ప్రాసెస్ లో ఆ సొమ్ము తిరిగి బాధితుడికి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.