రెచ్చిపోయిన సైబర్​ క్రిమినల్స్​

రెచ్చిపోయిన సైబర్​ క్రిమినల్స్​
  • సిద్దిపేటలో​ ఒకే రోజు రూ.3.64 లక్షలు లూటీ

సిద్దిపేట, వెలుగు :  సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో గురువారం సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఒకే రోజు ఏడుగురి నుంచి రూ.3.64 లక్షలు కాజేశారని సీపీ ఎన్.శ్వేత తెలిపారు.   మోసపోయామని గ్రహించిన బాధితులు  వెంటనే నేషనల్​సైబర్​సెల్​హెల్ప్​లైన్​కు కాల్​ చేయగా సైబర్​నేరగాళ్ల​అకౌంట్లు ఫ్రీజ్​చేశారు.  వివిధ కేసుల వివరాలిలా ఉన్నాయి..

ఓటీపీ చెప్పలే...లింక్ ​ఓపెన్​ చేయలే..అయినా..

సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాధితుడి అకౌంట్ నుంచి అతడి ప్రమేయం లేకుండా, ఓటీపీ చెప్పకుండా, లింకు ఓపెన్ చేయకుండా రూ.49,999 కొట్టేశారు. డబ్బులు కట్ అయిన విషయం తెలుసుకున్న బాధితుడు నేషనల్​ సైబర్ సెల్ హెల్ప్ లైన్ నంబర్​1930 కాల్ చేయడంతో వారు స్పందించి సైబర్​క్రిమినల్​ అకౌంట్​లోని  రూ.46,999 - ఫ్రీజ్​చేశారు.

జాబ్ ల​కోసమై వలలో పడ్డారు..

సిద్దిపేట వన్​టౌన్​పీఎస్​పరిధిలోనే మరో బాధితుడు టెలిగ్రామ్ యాప్ లో పార్ట్ టైం జాబ్ ఉందని చూశాడు. అందులో ఇచ్చిన నంబర్​కు కాల్​చేశాడు. వాళ్లు చెప్పినట్టు వెబ్​సైట్​లో కుబేర్ ఫుడ్ ఐటమ్ కొన్నాడు. తర్వాత టాస్కులు ఇచ్చి ఇన్వెస్ట్  చేయమని చెప్పగానే నమ్మి రూ.64,132- పంపించాడు. తర్వాత వాళ్లు పంపిన లింక్​ఓపెన్ చేయగా బ్లాంక్​గా వచ్చింది. దీంతో  సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ కు  కాల్ చేయగా వారు సైబర్ క్రిమినల్​అకౌంట్ లోని రూ.11,000  ఫ్రీజ్​చేశారు. ఇదే పీఎస్​పరిధిలోని మరో బాధితుడి ఫోన్​కు ఆన్​లైన్​లో పార్ట్ టైం జాబ్ ఉందని ఓ లింక్​ పంపించారు. దాన్ని క్లిక్ చేయగా టెలిగ్రామ్ ఓపెన్​అయ్యింది. అందులో రిజిస్టర్ చేసుకోమని చెప్పగానే చేసుకున్నాడు. టాస్క్ బెస్ట్ ప్రొడక్ట్​లో చిన్నగా పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని సైబర్ క్రిమినల్​చెప్పగానే ఆశపడి గూగుల్ పే ద్వారా రూ.29,000 పంపించాడు. తర్వాత లింక్ ఓపెన్ చేయగా బ్లాక్ చేసి ఉండడంతో హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేశాడు. దీంతో సైబర్ నేరగాడి అకౌంట్ లోని రూ.2వేలు ఫ్రీజ్​చేశారు.  

తక్కువ టైంలో ఎక్కువ పైసలొస్తాయని..

గజ్వేల్ కు చెందిన బాధితుడు నబీర్మెన్ ఫైనాన్స్ కంపెనీలో డబ్బులు పెడితే తక్కువ టైంలో ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని ఆశపడ్డాడు. సైబర్ క్రిమినల్​పంపిన ఫోన్ నంబర్​కు గూగుల్ పే ద్వారా రూ.90 వేలు పంపించాడు. తర్వాత వెబ్​సైట్​ఓపెన్ చేయగా బ్లాక్ చేసి ఉంది. మోసపోయానని తెలుసుకుని1930 కి కాల్ చేసి చెప్పాడు. దీంతో మోసగాడి అకౌంట్​లోని  రూ.16వేలు ఫ్రీజ్​చేశారు.  

పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని..

సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాధితుడు ఆన్​లైన్ లో ఓ యాప్​చూసి రూ. వెయ్యి పెట్టుబడి పెట్టాడు. వారు రూ.2 వేలు ఇచ్చారు. ఇలా మూడు, నాలుగు వేలు పెట్టగా దానికి అమౌంట్​ఇచ్చారు. దీంతో ఇంకా ఎక్కువ పెడితే మరింత ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మి ఒకేసారి రూ.25 వేలు పెట్టాడు.  డబ్బులు రిటర్న్​రాకపోగా లింక్ బ్లాక్ చేశారు. దీంతో సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫిర్యాదు చేశాడు. వన్ టౌన్ పీఎస్​పరిధిలోనే మరో బాధితుడి వాట్సాప్​నంబర్​కు ఓ లింక్​రాగా ఓపెన్ చేశాడు. అందులో డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఉండడంతో రూ.15 వేలు పెట్టాడు. అయితే, ఇతడి అకౌంట్ లోకి డబ్బులు వచ్చినా డబ్బులు విత్ డ్రా కాకుండా బ్లాక్ చేయడంతో  అనుమానం వచ్చిన బాధితుడు  వెంటనే సైబర్ సెల్  హెల్ప్ లైన్ నెంబర్  కాల్ చేసి ఫిర్యాదు చేశాడు.  

ఓటీపీ, సీవీవీ చెప్పి..

వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఓ బాధితురాలికి సైబర్ నేరగాడు ఎస్​బీఐ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పాడు. వచ్చే నెల నుంచి క్రెడిట్ కార్డ్ చార్జీలు రూ.2,500 కట్ చేయకుండా చేస్తానని, ఇప్పటివరకు కట్ చేసిన అమౌంట్ ను రిఫండ్ చేస్తానని చెప్పాడు. ఇది నమ్మిన  బాధితురాలు తన క్రెడిట్ కార్డు వివరాలు, ఓటీపీ, సీవీవీ నంబర్​చెప్పింది. దీంతో బాధితురాలి క్రెడిట్​కార్డులోని రూ. 90,994 కట్ అయ్యాయి. వెంటనే జాతీయ సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్​చేసి ఫిర్యాదు చేసింది.