
గండిపేట, వెలుగు: ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శితో అమర్యాదగా ప్రవర్తించిన మహిళా కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రాజేంద్రనగర్లోని అగ్రికల్చర్ వర్సిటీలో ఏబీవీపీ నాయకులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 55 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు యత్నించగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ తప్పించుకునేందుకు పరుగులు తీసింది. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు స్కూటీపై ఆమె వెనకాల వెళ్లి ఒకరు ఝాన్సీ జుట్టు పట్టుకొని లాగడంతో కింద పడిపోగా తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్పందించిన సైబరాబాద్ సీపీ విచారణకు ఆదేశించారు. కానిస్టేబుల్ అయేషా దురుసుగా ప్రవర్తించినట్లు తేలడంతో ఆమెను సస్పెండ్ చేశారు.