- అందులో హైదరాబాద్కు చెందిన 56 లక్షల మంది సమాచారం
- డేటా చోరీ కేసులో నిందితుడు వినయ్ భరద్వాజ్ అరెస్ట్
- ఫరీదాబాద్ కేంద్రంగా దందా
- 24 రాష్ట్రాల వారికి చెందిన డేటా వెబ్సైట్లో అమ్మకానికి
- వివరాలు వెల్లడించిన సైబరాబాద్ పోలీసులు
హైదరాబాద్, వెలుగు: పర్సనల్ డేటా చోరీ కేసులో కీలక నిందితుడు వినయ్ భరద్వాజ్ (36)ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వెబ్ సైట్ ద్వారా అతడు దాదాపు 67 కోట్ల మంది డేటాను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టినట్లు గుర్తించారు. ఇందులో 24 రాష్ట్రాల వారి సమాచారం ఉన్నట్లు తేల్చారు. 135 కేటగిరీలకు చెందిన మొత్తం 66.9 కోట్ల మంది వ్యక్తిగత డేటాబేస్ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో హైదరాబాద్కు చెందిన 56 లక్షల మంది పర్సనల్ డేటా, ఏపీకి చెందిన 2.10 కోట్ల మంది డేటా కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఢిల్లీ, నోయిడా, ముంబైలోని మూడు గ్యాంగులకు చెందిన15 మందిని ఇదివరకే అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారంతో హర్యానాలోని ఫరీదాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న డేటాసెంటర్పై సిట్ అధికారులు దాడులు చేశారు. ఈ వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శనివారం వెల్లడించారు.
సోషల్ మీడియా నుంచి చోరీ
దేశ భద్రత, ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే డేటా చోరీ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ కొనసాగిస్తోంది. సైబర్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ ఆధ్వర్యంలో డేటా థెఫ్ట్ గ్యాంగుల కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులను కస్టడీకి తీసుకుని విచారించారు. నిందితులు వెల్లడించిన సమాచారంతో అరెస్ట్లు కంటిన్యూ చేస్తున్నారు. ఇందులో భాగంగా వినయ్ భరద్వాజ్ గ్యాంగ్ను ట్రేస్ చేశారు. నిందితుడు వినయ్ భరద్వాజ్.. అమీర్ సోహెల్, మదన్ గోపాల్ అనే ఇద్దరితో కలిసి ఫరీదాబాద్లో డేటా సెంటర్ నిర్వహిస్తున్నాడు. థర్డ్ పార్టీ ఏజెన్సీలు, కన్సల్టెన్సీలు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సహా అన్ని సోషల్మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి డేటాను సేకరించారు. పేరు, తండ్రి పేరు, వృత్తి, విద్యార్హతలు, ఈ–మెయిల్స్, ఫోన్ నంబర్స్ సహా పూర్తి వ్యక్తిగత వివరాలతో డేటాను అమ్మకానికి పెట్టారు.
‘ఇన్స్పైర్వెబ్జ్’లో సేలింగ్
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, మెట్రో సిటీస్లోని అన్ని కేటగిరీలకు చెందిన వారి వ్యక్తిగత వివరాలను వినయ్ గ్యాంగ్ సేకరించింది. ఈ డేటాను అమ్మేందుకు ప్రత్యేకంగా ‘ఇన్స్పైర్వెబ్జ్’ పేరుతో వెబ్సైట్ను క్రియేట్ చేశారు. డేటాసేలింగ్ డీల్ ఓకే అయిన తర్వాత క్లౌడ్ డ్రైవ్ లింక్స్ ద్వారా క్లయింట్స్కి డేటాను పంపిస్తున్నారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సహా అన్ని రంగాలకు చెందిన వారి డేటాను అందుబాటులో పెట్టారు. జస్ట్ డయల్కు వచ్చే కాల్స్ ద్వారా క్లయింట్స్ను కాంటాక్ట్ అవుతున్నారు. ఎలాంటి డేటా కావాలనే వివరాలు తెలుసుకుని ముందు ప్రొఫార్మా పంపిస్తున్నారు. కస్టమర్ అంగీకరించిన తర్వాత డేటాను బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఇందులో ఫోన్ నంబర్స్, బ్యాంక్ అకౌంట్స్, పాన్, డెబిట్, క్రెడిట్ కార్డులకు ఉన్న డిమాండ్ను బట్టి డబ్బు వసూలు చేస్తున్నారు.
1.84 లక్షల క్యాబ్ యూజర్ల డేటా
వినయ్ డేటాసెంటర్లో బైజుస్, వేదాంతు సంస్థలకు చెందిన విద్యార్థుల డేటా, 8 మెట్రో సిటీస్లోని 1.84 లక్షల మంది క్యాబ్ వినియోగదారులు, గుజరాత్ రాష్ట్రంతో పాటు మరో 6 సిటీస్లోని 4.5 లక్షల మంది ఉద్యోగుల జీతభత్యాల డేటాను అమ్మకానికి పెట్టారు. జీఎస్టీ, ఆర్టీఏ, అమెజాన్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, పేటీఎం, ఫోన్పే, బిగ్ బాస్కెట్, బుక్మై షో, ఇన్స్టాగ్రామ్, జొమాటో, పాలసీ బజార్, అప్స్టాక్స్, పాన్ కార్డ్ హోల్డర్స్, 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు స్టూడెంట్ల డేటాను సేల్ చేస్తున్నారు. వయో వృద్ధులు, ఢిల్లీ విద్యుత్ వినియోగదారులు, డీమాట్ ఖాతాదారులు, నీట్ స్టూడెంట్స్, వారి పేరెంట్స్, రెసిడెన్సియల్ అడ్రస్లు, ఉద్యోగులు, ఇన్సూరెన్స్ పాలసీదారుల డేటాతో పాటు ఆన్లైన్ బ్యాంకింగ్ నెట్వర్క్కు సంబంధించిన డేటాను సైతం అమ్మేస్తున్నారు.
ఇవి కూడా అమ్మకానికి
నేషనల్, ఇంటర్నేషనల్ బ్యాంకుల డేటాతో పాటు ఫైనాన్సియల్ సర్వీసెస్, డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజినీర్స్, ట్రూ కాలర్, టెలికమ్, ట్రేడింగ్, స్టాక్ బ్రోకింగ్, కన్సల్టెన్సీ సర్వీసెస్ డేటా కూడా కోట్ల సంఖ్యలో ఉంది. నీట్ స్టూడెంట్స్ పేర్లు, పేరెంట్స్, ఫోన్ నంబర్స్ సహా రెసిడెన్సియల్ అడ్రస్ డేటా కూడా సేల్చేస్తున్నారు. పాన్ కార్డ్ డేటాబేస్, ఇన్కమ్, మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్స్, డేట్ ఆఫ్ బర్త్ సహా వ్యక్తిగత వివరాలను అమ్మేస్తున్నారు.