మొయినాబాద్ ఫాం హౌజ్ ఇష్యూలో ట్విస్టులు కంటిన్యూ అవుతున్నాయి. నిందితుల రిమాండ్ రిపోర్టును కొట్టివేయడంపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాసేపట్లో ఆ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరపనుంది. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పుపై సైబరాబాద్ పోలీసులు అప్పీల్ చేశారు. అరెస్ట్ ను రిజెక్ట్ చేయడంపై హైకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటీషన్ లో కోరారు. లంచ్ మోషన్ పిటిషన్ పై జస్టిస్ సుమలత బెంచ్ విచారణ జరుపనుంది. మరోవైపు నిబంధనల మేరకు పోలీసులు, నిందితులకు 41A సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు.
మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చినట్టుగా సరైన ఆధారాలు లేవంటూ నిందితులకు రిమాండ్ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. వారిని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. 41 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చిన తర్వాతే విచారణ జరపాలని స్పష్టం చేశారు. దీంతో నిందితులు రామ చంద్రభారతి, సింహయాజి, నందకుమార్లను పోలీసులు విడుదల చేశారు.