
హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్ పోలీస్కమిషనరేట్పరిధిలో గత 45 రోజుల్లో పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన 827 ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. సుమారు రూ. 2 కోట్ల విలువైన ఫోన్లను కనిపెట్టి, గురువారం బాధితులకు అందించినట్లు క్రైమ్ డీసీపీ ముత్యం రెడ్డి తెలిపారు. ఫోన్లు దొంగతనానికి గురైనా, లేదా పోయినా సమీప పోలీస్స్టేషన్లో లేదా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.
ఎల్బీనగర్: రద్దీ ప్రాంతాల్లో సంచరిస్తూ మొబైల్ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మీర్పేట్ నందనవనానికి చెందిన గారెడి మహేశ్, బుషేశ్గుప్తా నగర్ కు చెందిన సల్లంగుల నరేశ్, ఏపీలోని అనంతపురానికి చెందిన కుమ్మరి గోపి, కర్నూల్ కు చెందిన నగునూరి నాగమణి, అమె భర్త సాయికుమార్ ముఠాగా ఏర్పడి రద్దీ ప్రాంతాల్లో సంచరిస్తూ ఫోన్లు దొంగిలిస్తున్నారు. మహేశ్వరం జోన్ ఎస్ఓటీ ముఠాలోని నలుగురు నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.50 లక్షల విలువైన 473 ఫోన్లు రికవరీ చేశారు.