ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సైబరాబాద్ పోలీసుల కీలక చర్యలు

ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సైబరాబాద్ పోలీసుల కీలక చర్యలు
  • టీజీఐఐసీ, ఎస్సీఎస్సీతో సమన్వయ సమావేశం
  • రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ అడ్డంకులు తొలగించడంపై చర్చ

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు సైబరాబాద్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. కమిషనరేట్ ఆఫీస్​లో బుధవారం టీజీఐఐసీ, ఎస్సీఎస్సీ అధికారులతో సంయుక్తంగా ట్రాఫిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు. 

జాయింట్‌‌‌‌ సీపీ డాక్టర్ గజరావు భూపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీజీఐఐసీ వైస్‌‌‌‌ చైర్మన్ కె.శశాంక , ఎస్సీఎస్సీ సీఈవో నవేద్ ఖాన్, మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఈ సమావేశంలో ప్రధానంగా రోడ్ల విస్తరణ పనులు, ట్రాఫిక్​కు అడ్డంకులు తొలగించడంపై చర్చించారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో పీక్, నాన్​-పీక్ సమయాల్లో వాహనాల రాకపోకలను విశ్లేషించి, ట్రాఫిక్​ను సులభతరం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. 

ముఖ్యంగా, ట్రాఫిక్​కు ఆటంకం కలిగించే విద్యుత్ స్తంభాలు, నీటి పైప్​లైన్​లను తరలించాలని నిర్ణయించారు. నగరంలోని ట్రాఫిక్ సమస్యలను సమగ్రంగా పరిష్కరించడానికి వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం అవసరాన్ని జాయింట్ సీపీ గజరావు భూపాల్  వివరించారు.