
- సైబర్ నేరగాళ్ల మోసాలు
- అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లు దీపావళి ఆఫర్లను టార్గెట్ చేశారు. ఆకర్షణీయమైన తగ్గింపులు, బహుమతుల పేరుతో అందినంత
దోచేస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్లకు నకిలీ వెబ్సైట్లు, ఫిషింగ్ లింకులు పంపించి, ఫోన్లలో మాల్వేర్ యాప్లు ఇన్స్టాల్ చేయిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేసి మనకు తెలీకుండానే మన డబ్బులు కొల్లగొడుతున్నారు.
ఇలా అక్టోబర్ 1వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు మొత్తం 390 మందిని మోసం చేశారు. నకిలీ ప్రకటనలు, యూఆర్ఎల్ లింకులతో రూ. 8.5 లక్షలు కొట్టేశారు. ఈ మేరకు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) గురువారం (అక్టోబర్ 16) ఓ ప్రకటన విడుదల చేసింది. దీపావళి ఆఫర్ల పేరుతో వస్తున్న ప్రకటనలు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ హెచ్చరించారు.
నకిలీ ఈ-కామర్స్ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్రకటనలు సృష్టించడం ద్వారా సైబర్ నేరగాళ్లు అకౌంట్లు హ్యాక్ చేస్తున్నట్లు తెలిపారు. వాట్సాప్, ఎస్ఎంఎస్, టెలిగ్రామ్ ద్వారా ఫిషింగ్ లింకులు, ఏపీకే ఫైళ్లు పంపంచి యాప్ ఇన్స్టాల్ చేయిస్తున్నట్లు వివరించారు. యాప్ ఇన్స్టాల్ చేసిన వెంటనే బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీల ద్వారా అందినకాడికి దోచేస్తున్నట్లు వెల్లడించారు. ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లను గుర్తించాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు శిఖాగోయల్ సూచించారు.