- ముందుగా ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్ చేసి వ్యక్తుల డేటా దొంగిలించిన హ్యాకర్లు
- ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్తో నగదు కొట్టేశారు
- బీహార్లోని కిషన్ గంజ్ కేంద్రంగా నెట్వర్క్ఇద్దరిని అరెస్టు చేసిన
హైదరాబాద్, వెలుగు: వేలిముద్రలు, ఆధార్ నంబర్లతో అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న సైబర్ నేరగాళ్ల గుట్టు రట్టయింది. ఓటీపీ లేకుండానే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం, సిలికాన్ ఫింగర్ ప్రింట్లతో నగదు దొంగిలిస్తున్న ఇద్దరిని సీఐడీ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బీహార్ కేంద్రంగా ఫింగర్ ప్రింట్స్, ఆధార్ నంబర్ హ్యాకింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ గ్యాంగ్ వివరాలను సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.
సికింద్రాబాద్కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి సెయింట్ మెరీస్ రోడ్లోని ఎస్బీఐలో అకౌంట్ ఉంది. ఆయన ఖాతా నుంచి నిరుడు డిసెంబర్లో 4, 5వ తేదీల్లో ట్రాన్సాక్షన్లు జరిగాయి. మొదటి రోజు రూ.10 వేల చొప్పున రెండుసార్లు, తరువాతి రోజు రూ.2 వేల చొప్పున మరో రెండుసార్లు క్యాష్ విత్డ్రాల్స్ జరిగాయి. ఓటీపీ లేకుండానే మొత్తం రూ.24 వేలు విత్డ్రా అయింది. బాధితుడి ఫోన్ నంబర్కి ఓటీపీలు లేకుండా క్యాష్ విత్డ్రా జరిగినట్లు మెసేజ్లు వచ్చాయి. దీంతో బాధితుడు సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు ట్రాన్స్ఫర్ అయిన బ్యాంక్ ఖాతా ఆధారంగా ఇన్స్పెక్టర్ సురేశ్ బాబు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేశారు.
ప్రభుత్వ వెబ్ సైట్లలో వ్యక్తిగత డేటా హ్యాక్
బీహార్లోని కిషన్గంజ్కు చెందిన రంజిత్ సింగ్ (29), సఫత్ ఆలం (21) స్థానికంగా కస్టమర్ సర్వీస్ పాయింట్స్ (సీఎస్పీ) ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. మరికొంత మందితో కలిసి ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేశారు. ఆధార్తో లింకైన బ్యాంకు ఖాతాలను కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. ఇందుకు రిజిస్ట్రేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ సహా ఫింగర్ ప్రింట్స్, ఆధార్ నంబర్లు ఉన్న ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేశారు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, సేల్డీడ్స్, ఆధార్ నంబర్లను హ్యాక్ చేశారు. ఇలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన రిజిస్ట్రేషన్, రెవెన్యూ, ఇతర డిపార్ట్మెంట్ల సర్వర్ల నుంచి నుంచి డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. డాక్యుమెంట్లపై ఉన్న ఫింగర్ ప్రింట్లను క్లోనింగ్ చేసి సిలికాన్ ఫింగర్ ప్రింట్లుగా మార్చారు. ఆధార్ నంబర్తో లింక్ అయిన బ్యాంకు వివరాలు సేకరించి అకౌంట్ నంబర్ తెలుసుకున్నారు. ఆ తరువాత ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టంతో సిలికాన్ ఫింగర్ ప్రింట్లతో లావాదేవీలు చేశారు. ఇలా ఓటీపీ లేకుండానే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారు.
ఒక్కో ట్రాన్సాక్షన్ రూ.2 వేల నుంచి 10 వేల లోపే
అకౌంట్ హోల్డర్లకు అనుమానం రాకుండా హ్యాకర్లు రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు మాత్రమే కొట్టేస్తున్నారు. మళ్లీ కొంతకాలం తర్వాత అదే అకౌంట్ను టార్గెట్ చేసుకొని తక్కువ మొత్తంలో ఎక్కువ డబ్బు ఖాళీ చేస్తున్నారు. ఇలా సికింద్రాబాద్కు చెందిన బాధితుడి అకౌంట్ నుంచి రూ.24 వేలు కొట్టేశారు. బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి ట్రాన్స్ఫర్ అయిన నగదు ఆధారంగా సీఐడీ పోలీసులు దర్యాప్తు చేశారు. బీహార్లో బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. డిసెంబర్ 22న కిషన్ గంజ్కు చెందిన అక్మల్ ఆలం (26)ను అరెస్టు చేశారు. సీఎస్పీ గ్యాంగ్లో రంజిత్ షా, సఫత్ ఆలం వివరాలు సేకరించా రు. అప్పటికే ఆ ఇద్దరూ పరారీలో ఉన్నారు. బెంగళూర్లో షెల్టర్ తీసుకుంటున్న సఫత్ ఆలంను ఈ నెల 14న అరెస్టు చేశారు. రంజిత్ షాను ఈనెల 24న బీహార్లోని కిషన్ గంజ్లో అరెస్టు చేశారు. ఇద్దరినీ కస్టడీకి తీసుకుని ఫింగర్ ప్రింట్ల నెట్వర్క్ను ఛేదిస్తామని సీఐడీ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.