
మెట్పల్లి, వెలుగు : ఓ వ్యక్తికి ఫోన్కు సైబర్ నేరగాళ్లు లింక్ పంపి, ఓటీపీ తెలుసుకొని రూ. 1.84 లక్షలు కొట్టేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన జోగ నవీన్ తన సోదరుడి క్రెడిట్ కార్డుతో ఓ సంస్థ వెబ్సైట్ నుంచి టీవీ కొన్నాడు. ఆదివారం టీవీ రావడంతో దానిని ఆన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా సమస్య ఏర్పడింది. దీంతో నవీన్ టీవీని రిటర్న్ చేసేందుకు ఆన్లైన్ సంస్థను సంప్రదించాడు. వాళ్లు టీవీకి సంబంధించిన కంపెనీకి ఫోన్ చేయాలని సూచించారు. దీంతో ఆన్లైన్లో కస్టమర్ కేర్ నంబర్ వెతికి దానికి ఫోన్ చేశాడు. దీంతో ఓ వ్యక్తి లైన్లోకి వచ్చి టీవీ కొనుగోలు చేసిన నంబర్ చెప్పాలని నవీన్ను అడిగి, ఆ నంబర్కు ఓ లింక్ పంపించాడు.
తర్వాత లింక్ను ఓపెన్ చేసి తాను చెప్పినట్లు చేయాలని, ఓటీపీ చెప్పాలని అడగడంతో నవీన్ ఓటీపీ చెప్పాడు. వెంటనే అతడి అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో బ్యాంక్కు వెళ్లి అకౌంట్ వివరాలు చెక్ చేయగా అకౌంట్ నుంచి రూ. 1.84 లక్షలు కట్ అయినట్లు తెలిసింది. మోసపోయానని గ్రహించిన నవీన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.