తెలంగాణలో ఇక వర్షాలు లేనట్లే.. వారం రోజులు ఎండలే

తెలంగాణలో ఇక వర్షాలు లేనట్లే.. వారం రోజులు ఎండలే
  • వాతావరణ శాఖ వెల్లడి

హైదరాబాద్, వెలుగు:మొంథా తుఫాన్ ముప్పు తప్పింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురవడంతో గురువారం కూడా తుఫాన్ ప్రభావం ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పలు జిల్లాలకు రెడ్​ అలర్ట్​ కూడా ఇచ్చారు. ఫ్లాష్​ ఫ్లడ్ ​వార్నింగ్స్​సైతం జారీ చేశారు. అయితే అదృష్టవశాత్తు గురువారం ఉదయానికి తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది.

 నాలుగైదు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు తప్ప పెద్ద వానలేమీ పడలేదు. మొంథా తుఫాన్ బుధవారం సాయంత్రానికే వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం దక్షిణ చత్తీస్‌‌‌‌గఢ్​ పరిసరాల్లో  కేంద్రీకృతమైంది. అది గురువారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మరింత బలహీనపడింది. ప్రస్తుతం ఈ తీవ్ర అల్పపీడనానికి ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆ రెండు కలిసి మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్‌‌‌‌గఢ్​ ప్రాంతంలో శుక్రవారం అల్పపీడనంగా మరింత బలహీనపడనుంది. 

దీంతో రాష్ట్రంలో వారం రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. చిన్న చిన్న జల్లులు తప్ప, పెద్ద వర్షాలేమీ ఉండవని తెలిపింది. హైదరాబాద్​సిటీలోనూ ఇవే పరిస్థితులు ఉంటాయని చెప్పింది. ఉదయం, రాత్రి సమయాల్లో పొగమంచుతో పాటు మబ్బు పట్టి ఉంటుందని పేర్కొంది. 

కాగా, గురువారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. అత్యధికంగా నిర్మల్​జిల్లా భైంసాలో 2.2 సెంటీమీటర్ల వర్షం పడింది. ఆదిలాబాద్​జిల్లా ఇచ్చోడలో 2, పొచ్చరలో 1.8, నిర్మల్​జిల్లా వానల్​పహాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1.7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.