- హుజూరాబాద్లోని అన్ని దళిత కుటుంబాలనూ సర్వే చేస్తం: రాహుల్ బొజ్జా
- దళితబంధు పోర్టల్ త్వరలోనే అందుబాటులోకి
- ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 3 వరకు సర్వే: కలెక్టర్ కర్ణన్
కరీంనగర్: దళిత బంధు కోసం నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబాన్నీ అధికారులు వ్యక్తిగతంగా కలిసి వివరాలు సేకరిస్తారని సీఎం ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జా చెప్పారు. దళిత బంధు ఖాతాను ప్రత్యేకంగా తెరిపిస్తున్నామని.. సర్వేకు అధికారులు వెళ్లిన రోజే ఇది జరిగిపోతుందని తెలిపారు. నాలుగైదు గ్రామాలకు ఓ జిల్లా స్థాయి అధికారిని సర్వే కోసం నియమించామని.. వీళ్ల కింద మండల స్థాయి అధికారులుంటారని చెప్పారు. ఇదివరకే వివిధ పథకాల కోసం తీసుకున్న లిస్టును జిల్లా కలెక్టర్కు అందించామని.. ఇందులో మార్పులుంటే సర్వేకు వచ్చిన అధికారులతో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సర్వే ద్వారా ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నాయనే అంచనాకు వస్తామన్నారు. 21 వేల కుటుంబాలున్నాయనే సమాచారం ఉన్నా.. పెళ్లిళ్ల వల్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మీడియాతో రాహుల్ మాట్లాడారు.
లబ్ధిదారులపై రెండేళ్లు మానిటరింగ్
దళిత బంధు స్కీమ్కు కేవలం దళితులైతే చాలని రాహుల్ అన్నారు. సర్వే టైమ్లోనే ఏ యూనిట్ను పెట్టాలనుకుంటున్నారో నమోదు చేస్తామన్నారు. ఈ స్కీమ్ అమలుకు కలెక్టర్ ఖాతాలోకి ఇప్పటికే రూ. 1,500 కోట్లు వచ్చాయని.. ఇంకో రూ.500 కోట్లు రెండ్రోజుల్లో జమవుతాయని వివరించారు. సర్వే పూర్తయ్యాక గ్రామాల్లో ఎంపిక చేసిన వాళ్ల లిస్టు పెడతామన్నారు. పైలెట్ ప్రాజెక్టు కాబట్టి రెండేళ్ల పాటు ఈ లబ్ధిదారులపై అధికారుల మానిటరింగ్ ఉంటుందని చెప్పారు. దళిత బంధు పోర్టల్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని.. ఇప్పటికైతే యాప్ అందుబాటులో ఉందని చెప్పారు. ఈ నెల 27 నుంచి నియోజకవర్గంలో సర్వే మొదలవుతుందని, సెప్టెంబర్ 3 కల్లా ఇది పూర్తవుతుందని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు. సర్వే కోసం 400 మంది పని చేస్తారన్నారు. దళిత బంధు ఖాతాలు తెరవడానికి బ్యాంకు అధికారులను ప్రతి మండలానికీ కేటాయించామని.. సర్వే జరుగుతున్న రోజే ఖాతా తెరుస్తారని వివరించారు.