16న హుజూరాబాద్ లో దళిత బంధు ప్రారంభం

16న హుజూరాబాద్ లో దళిత బంధు ప్రారంభం
  • కేబినెట్ సమావేశంలో తీర్మానం

హైదరాబాద్: దళిత బంధు పథకాన్ని ఈనెల 16న  పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అందుకు పూర్తిస్థాయిలో అధికారయంత్రాంగం సిద్దం కావాలని కేబినెట్ ఆదేశించింది. దళిత బంధు పథకం అమలు, విధి విధానాల రూపకల్పనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం  సమావేశమైన రాష్ట్ర కేబినెట్ విస్తృతంగా చర్చించింది. కేబినెట్ సమావేశంలో దళిత బంధు పథకం పూర్వాపరాలను సీఎం కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలోని ఆన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ  రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదనీ,  ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. 
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... మిషన్ కాకతీయ పథకం అమలు వల్ల చెరువుల కింద సాగు పెరిగిందని, భూగర్భ జలాలు పెరిగాయని..  పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యి అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చిందన్నారు. నిరంతరాయంగా కరెంటు సరఫరా చేయడం వల్ల సాగు విస్తీర్ణం బాగా పెరిగిందని, ఈరోజు రాష్ట్ర ఆదాయంలో 20 శాతం ఆదాయం వ్యవసాయ రంగం నుంచే వస్తున్నదని, ఇది తెలంగాణా చరిత్రలో మేలిమి మలుపు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామాల్లో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తున్నదనీ., పల్లె ప్రగతి వల్ల మౌలిక వసతుల కల్పన జరిగి, గ్రామీణ జీవితం ఆహ్లాదంగా మారిందన్నారు. దీని పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనీయుడని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
సమైక్య రాష్ట్రంలో విచ్చిన్నమయిపోయిన వృత్తిపనులవారి జీవితాలను నిలబెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేపట్టిందని సిఎం అన్నారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేసే ప్రణాళికలు అమలు చేస్తూ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వృత్తి పనులు  చేసుకునే వారి ఆదాయాలు మెరుగు పడేందుకు తోడ్పడ్డాయన్నారు. గొర్ల పంపిణీ గొల్ల కుర్మలకు లాభం చేకూర్చిందని, పశు సంపద పెరిగిందని, ముఖ్యంగా గొర్రెల సంఖ్య ఎక్కువున్న రాష్ట్రం తెలంగాణా అని పార్లమెంటు వేదికగా స్వయంగా కేంద్రం ప్రకటించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.  ఇటీవల గొర్రెల యూనిట్ ధరను కూడా లక్షా ఇరవై ఐదు వేలనుంచి లక్షా డెబ్బై ఐదువేలకు పెంచామని ముఖ్యమంత్రి అన్నారు. 
చేపల పెంపకం ప్రోత్సహించడం వల్ల మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని సీఎం తెలిపారు. గీత కార్మికులకు చెట్ల పన్ను బకాయీలు రద్దు చేయటమే కాకుండా చెట్లకు పన్ను వేసే విధానాన్నే రద్దు చేసామని ముఖ్యమంత్రి తెలిపారు. నేత, మరమగ్గాల వారి ఆదాయాలు మెరుగు పడ్డాయని, నూలు రంగుల మీద సబ్సిడీతోపాటు బతుకమ్మ చీరల ఉత్పత్తి ద్వారా చేతినిండా పని దొరికేలా చేసామని ముఖ్యమంత్రి అన్నారు.
రైతు భీమా తరహాలో గీత కార్మికులకు భీమా 
రైతుబీమా అమలవుతున్న విధంగా అంతే  పకడ్బందీగా,  క్రమబద్ధంగా నేత, గీత కార్మికులకు బీమా సదుపాయం కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నేత, గీత కార్మికులు ఆశావహంగా బీమా సదుపాయం కోసం వేచి వున్నారని, సత్వరమే అమలు విధానం పై స్పష్టత తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. 
దళిత బంధు పథకానికి చట్టబద్దత
దళిత జాతి పేదరికం రూపుమాపాలని ప్రవేశ పెడుతున్న తెలంగాణా దళితబంధు పథకానికి రాష్ట్ర క్యాబినెట్ ముక్త కంఠంతో  ఆమోద ముద్ర వేసింది. దళిత జాతి కష్టాలు తీర్చడానికి ప్రవేశ పెడుతున్న తెలంగాణా  దళితబంధు పథకం అమలుకు సంబంధించి మంత్రివర్గ సభ్యులు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ సందర్భంగా దళితబందు పథకానికి చట్టభద్రత కల్పిస్తూ ఒక ప్రత్యేక చట్టం తీసుకు రావాలని క్యాబినెట్ అభిప్రాయ పడింది. గతం లో ఎస్ సి ప్రగతి నిధి చట్టం తెచ్చి, ఒక వార్షిక బడ్జెట్ లో దళితులకు కేటాయించిన నిధులలో మిగిలిన నిధులను తరువాతి వార్షిక బడ్జెట్ కు బదలాయించే విధానం తీసుకొచ్చామన్నారు. ఆ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అదే విధంగా దళిత బంధు కూడా దేశానికి దారి చూపే పథకం అవుతుందనీ క్యాబినెట్ అభిప్రాయ పడింది.
రెక్కల కష్టం తప్ప మరే ఆస్తి లేని దీన స్థితిలో దళిత ప్రజలు ఉన్నారని, రాష్ట్రంలో ఇరవై శాతం జనాభా ఉన్న దళితుల చేతుల్లో ఉన్న సాగుభూమి  కేవలం పదమూడు లక్షల ఎకరాలేనని  దళితుల పేదరికానికి ఇంతకు మించిన గీటురాయి లేదని.. ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో గిరిజనుల కన్నా దయనీయ పరిస్థితుల్లో దళితులు ఉన్నారని ముఖ్యమ్నంత్రి పేర్కొన్నారు. దళితుల అభివృద్ధి, అరకొర సహాయాలతో సాధ్యం కాదని, అందుకే దళితబంధు లో ఒక యూనిట్ పెట్టుకోవడానికి పదిలక్షల రూపాయల పెద్దమొత్తం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సిఎం అన్నారు. బ్యాంకులతో అనుసంధానం పెట్టుకోలేదని, తిరిగి చెల్లించే భారం ఉంటే దళితుల ఆదాయంలో ఆర్ధిక స్థితిలో మెరుగుదల రాదనీ ముఖ్యమంత్రి తెలియ జేశారు. లబ్దిదారులు ఒక సమూహంగా ఏర్పడి పెద్ద పెట్టుబడితో  పెద్ద యూనిట్ పెట్టుకునే అవకాశాన్ని దళితబందు పథకం ద్వారా కల్పించాలనే ముఖ్యమంత్రి నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉపాధి,వ్యాపార మార్గాన్ని ఎంచుకునే స్వేచ్చ లబ్దిదారులదే అని, ప్రభుత్వం అధికారులు, దళిత బంధు స్వచ్చంద కార్యకర్తలూ  ఈ దిశగా మార్గదర్శనం చేస్తారని, అవగాహన కల్పిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. 
లబ్ది దారుడు ఎంచుకున్న ఉపాధిని అనుసరించి సంబంధిత ప్రభుత్వ శాఖ శిక్షణ అవగాహన కల్పించాలని క్యాబినెట్ అభిప్రాయ పడ్డది. శిక్షణ, పర్యవేక్షణ కోసం గ్రామస్థాయి నుంచీ రాష్ట్ర స్థాయి వరకూ వివిధ శాఖల అధికారులతో, గ్రామంలోని చైతన్యవంతులైన వారి భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. అమలులో  జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి కీలక పాత్ర పోషిస్తారని ముఖ్యమంతి అన్నారు.
దళిత పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం కోసం ప్రతి జిల్లాలో ‘సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ ప్రైజ్’
దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతిజిల్లాలో  ‘‘సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ ప్రైజ్’’  ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. యూనిట్ పెట్టగానే ప్రభుత్వ బాధ్యత తీరిపోదని యూనిట్ సరిగ్గా నడుస్తుందా లేదా అన్న విషయాన్ని నిరంతరం పర్యవేక్షించడం కూడా ముఖ్యమని క్యాబినెట్ తీర్మానించింది. 
దళితబంధు పథకం అమలుకు పటిష్టమైన యంత్రాంగం అవసరం అనీ వివిధ శాఖలలో అదనంగా ఉన్న ఉద్యోగుల సమాచారం సమర్పించాలని ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావును కేబినెట్ ఆదేశించింది. దళిత బంధు ద్వారా ఎవరికైతే లబ్ది చేకూరుస్తారో  వారికి అందజేసే ఒక ప్రత్యేక కార్డు నమూనాలను క్యాబినెట్ పరిశీలించింది. ఈ కార్డు ఆన్ లైన్ అనుసంధానం చేసి లబ్దిదారుని పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. దళిత వాడల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని, మిగతా గ్రామంతో సమానంగా అన్ని హంగులూ దళిత వాడలకు ఏర్పడాలని, ఇందుకు నిధుల కొరత లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.