నేడు ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా.. అంతా టెన్షన్

నేడు ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా.. అంతా టెన్షన్
  • ఇంద్రవెల్లిలో టెన్షన్!
  • నేడు దళిత గిరిజన దండోరా
  • లక్ష మంది జన సమీకరణకు కాంగ్రెస్ నేతల కసరత్తు
  • సభాస్థలి వద్ద భారీ ఏర్పాట్లు
  • అడ్డుకుంటామంటున్న ఆదివాసీ సంఘాలు

ఆదిలాబాద్,​ వెలుగు: కాంగ్రెస్​ దళిత గిరిజన దండోరా చేపట్టడం, కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఆదివాసీ సంఘాలు ప్రకటించడంతో ఆదిలాబాద్​జిల్లా ఇంద్రవెల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంద్రవెల్లిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి సోమవారం తలపెట్టిన దళిత గరిజన దండోరాకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి 200 మంది కాంగ్రెస్​ముఖ్య లీడర్లతోపాటు లక్షమందికి తక్కువ కాకుండా జనాలను తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్లాన్​చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పజెప్పారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతుండగా 12 గంటలకు రేవంత్​రెడ్డి హాజరవుతారు.

లక్ష మందికి తగ్గకుండా.. 
సభకు జనాలను తీసుకొచ్చే పూర్తి బాధ్యతను స్థానిక నేతలు తీసుకున్నారు. ఆదిలాబాద్​ జిల్లా కేంద్రం, బేల, జైనథ్​ మండలాల నుంచి జనాలను తరలించే బాధ్యతను ఏఐసీసీ మెంబర్​ గండ్రత్​సుజాత, పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్​ఖాన్​ తీసుకున్నారు. పదివేలకు పైగా జనాలను ఆటోలు, జీపులు తదితర వాహనాల్లో తరలించే ఏర్పాట్లు పూర్తి చేశారు. బోథ్​నియోజకవర్గం నుంచి 20 వేల మందిని తరలించేందుకు తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్​రెడ్డి, నాయకులు డాక్టర్​ అన్నెల అశోక్​బాధ్యతలు తీసుకున్నారు. నిర్మల్, ముథోల్​ప్రాంతాలకు మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​రెడ్డి, ఖానాపూర్​ ప్రాంతానికి భారత్​చౌహాన్ బాధ్యత తీసుకుని 15 వేల మందిని తీసుకొచ్చేలా ప్లాన్​చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లా నుంచి 15 వేల మందిని తీసుకొచ్చేందుకు విశ్వప్రసాద్​ బాధ్యతలు తీసుకున్నారు. మంచిర్యాల, చెన్నూర్​, బెల్లంపల్లి ప్రాంతాలనుంచి జనాలను తీసుకొచ్చే బాధ్యత ప్రేంసాగర్​ రావ్​ తీసుకున్నారు. అన్ని మండల, గ్రామస్థాయిలో జనాలను తీసుకొచ్చే బాధ్యతలను ఆయా నేతలకు అప్పజెప్పారు. 

అడ్డుకునేందుకు ఆదివాసీల ప్లాన్
ఇంద్రవెల్లి సభను అడ్డుకునేందకు ఆదివాసీ సంఘాలు ప్లాన్​చేస్తున్నాయి. సభకు వచ్చే ముఖ్య నేతలను మధ్యలోనే అడ్డుకోవాలని భావిస్తున్నారు. 1976లో ఎస్టీ జాబితాలో లంబాడాలను చేర్చిన కాంగ్రెస్​ఇపుడు మళ్లీ తమపై విద్రోహ చర్యకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. లంబాడాలు, గోండులు కలిసి ఉద్యమాలు చేశారని రేవంత్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఇంద్రవెల్లిలో వైభవంగా జరుపుతామని, ఈ సంవత్సరం అదేరోజు రాజకీయ పార్టీ సభ ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సభను ఎట్టి పరిస్థితుల్లో నడవనీయమని సంఘం నేతలు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గొడవలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. 

ఎట్టి పరిస్థితుల్లో సభ జరగనీయం
నేటి ఇంద్రవెల్లి సభను ఎట్టి పరిస్థితిలో జరగనీయం. గోండులు, లంబాడాలు కలిసి పో రాటాలు చేశారని చెప్పిన రేవంత్​రెడ్డి స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. ఆదివాసీల ఉద్యమాలకు లంబాడాలు ఎప్పుడూ సహకరిం చలేదు. పైగా మమ్మల్ని పాతాళానికి తొక్కారు. వారిని ఎస్టీ జాబితాలో కలిపిన కాంగ్రెస్​పార్టీ ఇపుడు మాయమాటలు చెబుతోంది. 
- గొడం గణేష్​, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు