
హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్లోని రాష్ట్ర సెక్రటేరియెట్లో గురువారం సాయంత్రం మరోసారి పెచ్చులూడాయి. ఇన్నర్ లాన్లో సీఎం, మంత్రుల కాన్వాయ్ వెళ్లే మార్గంపై శకలాలు పడ్డాయి. అయితే, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి 12న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. సచివాలయం ఆరో అంతస్తు నుంచి ఒక పెద్ద పెచ్చు భాగం ఊడి, అక్కడ పార్క్ చేసి ఉన్న రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ కారుపై పడింది. కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
అప్పట్లో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ (ఆర్ అండ్ బీ) శాఖ ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపింది. తాజాగా, ఓ కిటికీ కింది అంచు ఊడిపడటంతో సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే సచివాలయంలో పలుచోట్ల వాటర్ లీకేజీలు, గోడలకు పగుళ్లు కనిపిస్తున్నాయి. ఈ తాజా ఘటనపై జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం, ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. సచివాలయ నిర్మాణ ఖర్చు రూ. 617 కోట్ల నుంచి సుమారు రూ. 1200 కోట్లకు పెరగడంపై గతంలోనే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యయం రెట్టింపు కావడంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ జరుపుతోంది.