- స్టూడెంట్స్కు స్టైపెండ్ ఎగ్గొడ్తున్నయ్
- మెడికల్ పీజీ అడ్మిషన్లలో ప్రైవేటు కాలేజీల దందా
- స్టైపెండ్ను వదులుకునేటోళ్లకే సీట్లు
- అడ్మిషన్ల సమయంలోనే అడ్డగోలు కండీషన్లు
- ఖాళీ చెక్కులపై సంతకాలు..
- స్టూడెంట్ల బ్యాంకు బుక్కులు, ఏటీఎం కార్డులూ తీసుకుంటున్న కాలేజీలు
హైదరాబాద్, వెలుగు: మెడికల్ పీజీ స్టూడెంట్స్కు ఇవ్వాల్సిన స్టైపెండ్ను ప్రైవేటు కాలేజీలు ఎగ్గొడుతున్నాయి. స్టైపెండ్ను వదులుకునేందుకు సిద్ధమైన స్టూడెంట్స్ను మాత్రమే చేర్చుకుంటున్నాయి. ప్రస్తుతం మెడికల్ పీజీ అడ్మిషన్లు జరుగుతున్నాయి. సీట్లు అలాట్ అయిన స్టూడెంట్స్ వెళ్లి కాలేజీల్లో జాయినింగ్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే స్టైపెండ్ను వదులుకోవడానికి ఒప్పుకున్న విద్యార్థుల నుంచే కాలేజీల యాజమాన్యాలు జాయినింగ్ లెటర్లు తీసుకుంటున్నాయి. స్టైపెండ్ ఇవ్వాల్సిందేనని అడిగిన స్టూడెంట్స్ నుంచి జాయినింగ్ లెటర్స్ తీసుకోవడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే.. దిక్కున్న చోట చెప్పుకోవాలంటూ దబాయిస్తున్నారు. దాదాపు ప్రైవేటు మెడికల్ కాలేజీలన్నీ అధికార పార్టీ నేతలవే కావడం, గతంలో స్టైపెండ్స్ దందాకు సంబంధించి మెడికోలు ఫిర్యాదులు చేసినా కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పట్టించుకోకపోవడం వంటి కారణాలతో మెజారిటీ విద్యార్థులు బాధతోనే స్టైపెండ్ వదిలేసుకుంటున్నారు. స్టైపెండ్ కోసం ఆలోచిస్తే ఏండ్లకు ఏండ్లు కష్టపడి సంపాదించిన పీజీ సీటు దక్కదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో కాలేజీది ఒక్కో స్కెచ్
స్టైపెండ్ను వదులుకోవడానికి సిద్ఢమైన స్టూడెంట్లతో కాలేజీల యాజమాన్యాలు ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకుంటున్నాయి. స్టూడెంట్ల బ్యాంకు అకౌంట్లలో స్టైపెండ్ వేసి, ఈ చెక్కుల ద్వారా రిటర్న్ తీసుకునేందుకు ఈ ప్లాన్ వేశాయి. ఇంకొన్ని కాలేజీలు స్టైపెండ్ కోసం సెపరేటుగా స్టూడెంట్లతో ఓ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి, ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన పాస్బుక్, ఏటీఎం కార్డులను తీసుకుంటున్నాయి. ప్రతి నెలా స్టైపెండ్ను జమ చేయడం, విత్డ్రా చేసుకోవడం కోసం ఈ స్కెచ్ వేశాయి. మరికొన్ని కాలేజీలు ఏడాది కాలానికి స్టైపెండ్ ఎంత అవుతుందో లెక్కగట్టి ఆ మొత్తాన్ని స్టూడెంట్లతో ఇన్స్టాల్మెంట్ల రూపంలో కట్టించుకోవడానికి ప్లాన్ చేశాయి. ఈ ఆగడాలపై మెడికోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీజీ సీటు సంపాదించడానికి ఎంతో కష్టపడ్డామని, కనీసం స్టైపెండ్ కూడా లేకుంటే ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
మూడేండ్లు దోపిడీ
మెడికల్ పీజీ మూడేండ్ల కోర్సు. ఈ మూడేండ్ల పాటు కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్స్లోనే పీజీలు పని చేయాల్సి ఉంటుంది. పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తూనే చదువుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమయం కాలేజీ, హాస్పిటల్లోనే వెచ్చిస్తున్నందున ప్రతి స్టూడెంట్కు కంపల్సరీగా స్టైపెండ్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు చెబుతున్నాయి. మన రాష్ట్రంలో ఫస్ట్ ఇయర్ పీజీకి రూ.58,289, సెకండ్ ఇయర్ పీజీకి రూ.61,528, ఫైనల్ ఇయర్ పీజీకి రూ.64,767 చొప్పున స్టైపెండ్ ఉంది. ప్రభుత్వ కాలేజీల్లో ఇర్రెగ్యులర్గా అయినా స్టైపెండ్ చెల్లిస్తున్నారు. ప్రైవేటు కాలేజీల్లో మాత్రం స్టైపెండ్ చెల్లించకపోగా, వివిధ పేర్లతో అదనపు వసూళ్లకు పాల్పడుతుండడం గమనార్హం.
లీగల్గా కొట్లాడుతాం
ప్రైవేటు మెడికల్ కాలేజీలు మెడికోలకు న్యాయంగా ఇవ్వాల్సిన స్టైపెండ్ ఇవ్వడం లేదు. ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం స్టైపెండ్ను స్టూడెంట్ల అకౌంట్లలో జమ చేయాలి. స్టైపెండ్ ఇస్తున్నదీ లేనిదీ ఈ అకౌంట్లను వెరీఫై చేసి ఎన్ఎంసీ తెలుసుకుంటుంది. ఈ క్రమంలో స్టూడెంట్ల నుంచి ఏటీఎం కార్డులు, బ్లాంక్ చెక్కులు తీసుకోవడం వంటివి కాలేజీలు చేస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని కాళోజీ హెల్త్ యూని వర్సిటీని, ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవ డం లేదు. ఫీజుల పెంపు విషయంలో కోర్టుకు వెళ్లినట్టే, స్టైపెండ్ దందా విషయంలోనూ లీగల్గా కొట్లాడాలని నిర్ణయించాం.
- డాక్టర్ మహేశ్, ప్రెసిడెంట్, హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్