
- ఉత్తర్వులు జారీ చేసిన
- భద్రాచల దేవస్థానం ఈవో
శ్రీరామనవమి సీతారాముల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలంలో ఈ నెల 20న ఎదుర్కోలు ఉత్సవం, 21న సీతారాముల కల్యాణం, 22న మహాపట్టాభిషేకానికి భక్తులకు దర్శనాలు రద్దు చేస్తూ దేవస్థానం ఈవో శివాజీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వేడుకలన్నీ ఆలయంలోని నిత్య కల్యాణ మండప ప్రాంగణంలో వైదిక కమిటీ సభ్యులు, ఉద్యోగుల సమక్షంలో నిర్వహిస్తున్నామని ఈవో వెల్లడించారు. గతంలో చిత్రకూట మండపంలో నిర్వహించాలని ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఆయన రద్దు చేశారు. భక్తుల ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్ సెకండ్వేవ్నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో శివాజీ పేర్కొన్నారు. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల సీతారామచంద్రస్వామి దేవస్థానంలోనూ 21న కల్యాణం, 22న పట్టాభిషేకం ఆంతరంగికంగానే నిర్వహించాలని ఉత్తర్వుల్లో తెలిపారు.
రాజన్న గుడిలో 18 నుంచి 22 వరకు ..
ఈ నెల 18 నుంచి 22 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న గుడిలో భక్తులకు దర్శనాలు రద్దు చేశారు. కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఆలయ అర్చకులు అంతరంగికంగా నిర్వహిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి తర్వాత జరిగిన శివ కల్యాణానికి అనుమతి లేకపోయినా సుమారు 50 వేలకు పైగా భక్తులు వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పట్టణంలో 756 కరోనా కేసులు నమోదయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల్లో సైతం వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 21న సీతారాముల కల్యాణానికి సైతం లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ఆదేశాలతో ఐదు రోజులపాటు ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. భక్తులు పరోక్షంగా ఆన్లైన్ద్వారా మొక్కుబడి పూజలు సమర్పించుకునే సదుపాయం కల్పించామని, భక్తులు మీ సేవా లేదా టి ఆప్ఫోలియో ద్వారా డబ్బులు చెల్లిస్తే పరోక్షంగా వారి గోత్రనామాలపై పూజలు జరిపిస్తామని ఆలయ అధికారులు చెప్పారు.