
అయోధ్య: బాలరాముడిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు వేచి చూస్తున్న వేళ.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్శుభవార్త చెప్పింది. నేటి(మంగళవారం) నుంచే సాధారణ భక్తులకు రాముడి దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. అయోధ్యలో బాలరాముడి దర్శనం, హారతి వేళల వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. దర్శన వేళలు ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంటాయని ప్రకటించింది.
ఉదయం 6.30 జాగరణ హారతికి ఒక రోజు ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని, రాత్రి 7.30 గంటల సంధ్యా హారతికి అదే రోజు బుకింగ్చేసుకున్నా సరిపోతుందని తెలిపింది. రాముడిని దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లాంటి ఏదోక గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి. హారతి కార్యక్రమానికి ఉచితంగానే పాస్ ఇస్తారు.
ఆన్లైన్ బుకింగ్ ఇలా..
బాలరాముడి దర్శనం, హారతి పాస్లకు ఆన్లైన్ బుకింగ్ చేసుకునేందుకు భక్తులు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధికారిక వెబ్సైట్కు వెళ్లాలి. అందులో మొబైల్ నంబరుతో లాగిన్ అయ్యి, ఓటీపీ ఎంటర్ చేసి వెరీఫై చేస్తే.. రిజిస్ట్రేషన్ నమోదు పూర్తవుతుంది. లాగిన్ అయిన తర్వాత.. ‘మై ప్రొఫైల్’ సెక్షన్లోకి వెళ్లి గుర్తింపు వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత హారతి/దర్శనం టైమ్ స్లాట్లను ఎంచుకుని.. పాస్ కోసం బుక్ చేసుకోవాలి.
ఎలా చేరుకోవాలి?
అయోధ్య రామ మందిర్ చేరుకోవడానికి దేశంలోని ప్రధాన నగరాల నుంచి రైలు, రోడ్డు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, లక్నో, వారణాసి, కోల్కతా నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడుస్తున్నాయి. అక్కడి నుంచి అయోధ్య రామ మందిర్వెళ్లడానికి ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు అయోధ్య మహర్షి వాల్మికి ఎయిర్పోర్ట్ తాజాగా అందుబాటులోకి వచ్చింది.