- ఈసారి ఆన్లైన్లోనే దర్శనం టోకెన్లు
- గత ఏడాది తొక్కిసలాట నేపథ్యంలో ఆఫ్లైన్ టోకెన్లు రద్దు
- 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయింపు
- టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
తిరుపతి: తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
గతేడాది తిరుపతిలోని కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో టోకెట్ల కేటాయింపులో పలు మార్పులు చేసింది. ఆఫ్లైన్టోకెన్లను పూర్తిగా రద్దు చేసింది. కేవలం ఆన్లైన్లోనే టోకెన్లు తీసుకోవాలని భక్తులకు సూచించింది. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది.
టోకెన్ల కేటాయింపు ఇలా..
సామాన్య భక్తుల కోసం ఉద్దేశించిన సర్వదర్శనం టోకెన్ల కేటాయింపులో టీటీడీ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. డిసెంబర్ 30, 31, జనవరి 1న దర్శనాలకు సంబంధించి ‘ఈ-డిప్’ ద్వారా టికెట్లను కేటాయించనున్నారు. ఇందుకోసం నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
డిసెంబర్ 2న ఆన్లైన్ డిప్ ద్వారా టోకెన్లను కేటాయిస్తారు. టోకెన్లను టీటీడీ వెబ్సైట్, యాప్, వాట్సాప్ ద్వారా మాత్రమే జారీ చేస్తారు. ఆఫ్ లైన్ విధానం పూర్తిగా రద్దు చేశారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1న శ్రీవాణి ట్రస్ట్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
