ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి దసరా శరన్నవరాత్రి వేడుకలు

ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి దసరా శరన్నవరాత్రి వేడుకలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు అక్టోబర్ 15 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు.  9 రోజుల పాటు వేడుకలు వైభవంగా నిర్వహించాలని వైదిక కమిటీ సభ్యులు నిర్ణయించారు. దుర్గగుడి పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు దసరా శరన్నవరాత్రుల ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. దసరా ఏర్పాట్లకు సంబంధించి ఇంజనీరింగ్ వర్క్స్ కు రూ. 2.5 కోట్లు ఖర్చు చేశామన్నారు. 

పలు దేవాలయాల నుంచి సుమారు 200 మంది ఇతర దేవాలయాల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి దసరా నవరాత్రుల సమయంలో వారి సేవలను వినియోగిస్తామని వెల్లడించారు. పది రోజులకు కాంట్రాక్టు పద్ధతిలో కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్నదాన భవనం కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. 

అమ్మవారి రూపాలు

2023 అక్టోబర్‌ 15న ఉత్సవాల తొలిరోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. 16న గాయత్రీదేవి, 17న అన్నపూర్ణాదేవి, 18న మహాలక్ష్మీదేవి, 19న లలితా త్రిపురసుందరీదేవి, 20న సరస్వతీదేవి, 21న దుర్గాదేవి, 22న మహిషాసురమర్దిని, 23న రాజరాజేశ్వరీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని వైదిక కమిటీ సభ్యులు తెలిపారు.