మంత్రిని ఎందుకు చంపాలనుకున్నారో సీపీ చెప్పలేదు

మంత్రిని ఎందుకు చంపాలనుకున్నారో సీపీ చెప్పలేదు
  • లై డిటెక్టర్​ పరీక్షలు చెయ్యాలె
  • మంత్రి హత్యకు కుట్ర కేసుపై దాసోజు

హైదరాబాద్​, వెలుగు: మంత్రి శ్రీనివాస్​గౌడ్​ హత్యకు కుట్రలో పోలీసుల వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ అన్నారు. ఈ కేసుకు సంబంధించి శ్రీనివాస్​ గౌడ్​, బీజేపీ నాయకులు, సైబరాబాద్​ సీపీ స్టీఫెన్​ రవీంద్రకు బహిరంగంగా లై డిటెక్టర్​ పరీక్షలు చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. గురువారం ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. హత్య కుట్రలో బీజేపీ నేతల పాత్రపై దర్యాప్తు చేస్తామంటూ పోలీసులు చెప్పారని, హత్య కుట్రపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. మంత్రిని ఎందుకు చంపాలనుకున్నారో సీపీ చెప్పలేదన్నారు. ‘‘మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ను హత్య చేసేందుకు రూ.12 కోట్లు ఎవరు ఇచ్చారు? సుపారీ ముఠా వద్ద దొరికిన తుపాకులెవరివి? అసలు మంత్రిని ఎందుకు చంపాలనుకున్నారు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది?’’ అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారమంతా సస్పెన్స్​ థ్రిల్లర్​ సినిమాను తలపిస్తోందన్నారు.