న్యూఢిల్లీ: యూఎస్ మార్కెట్లోని షేర్లతో పోలిస్తే దేశ మార్కెట్లోని షేర్లు ఎక్కువ లాభపడతాయని డాయిష్ బ్యాంక్ ఏజీ పేర్కొంది. ఆర్థిక పరిస్థితులు దేశంలో మెరుగ్గా ఉన్నాయని, కంపెనీల లాభాల గ్రోత్ కూడా బాగుందని వివరించింది. ‘దేశ మాక్రో ఎకానమీ అన్ని వైపుల నుంచి దూసుకుపోతోంది’ అని డాయిష్ బ్యాంక్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మయాంక్ ఖేమ్కా అన్నారు. పవర్, ఫ్యూయల్ డిమాండ్ నుంచి వెహికల్ సేల్స్ వరకు నమోదవుతున్న డేటాను ఇందుకు ఉదాహరణగా చూపించారు. ఇవన్నీ కార్పొరేట్ల పనితీరులో కనిపిస్తాయని, ఇక్కడి నుంచి మార్కెట్ పెరుగుదల కంపెనీల లాభాల గ్రోత్పై ఆధాపడి ఉంటుందని అన్నారు. కంపెనీల లాభాల గ్రోత్ రెండంకెల్లో ఉండొచ్చని అంచనావేశారు. మరోవైపు ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్లోని కంపెనీల పనితీరు దేశంలోని నిఫ్టీ, సెన్సెక్స్ కంపెనీల పనితీరుతో పోలిస్తే తక్కువగా ఉంటుందని డాయిష్ బ్యాంక్ అంచనావేసింది. దీంతో ఎస్ అండ్ పీ 500 రేటింగ్ డౌన్ గ్రేడ్ అవ్వొచ్చని పేర్కొంది. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి లోకల్ మార్కెట్లోకి రావడంతో దేశ స్టాక్ మార్కెట్లు సూపర్ ఛార్జ్ అయ్యాయని ఖేమ్కా అన్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ కూడా పెరగడంతో గత నెల రోజుల్లోనే నిఫ్టీ 10 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఆసియాలోని ఇతర స్టాక్ మార్కెట్లతో పోలిస్తే నిఫ్టీ 50 టాప్ పెర్ఫార్మర్గా నిలిచిందన్నారు. యూఎస్ ఎస్ అండ్ పీ 500 మాత్రం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 13 శాతమే లాభపడిందని అన్నారు. కరోనా సంక్షోభ ప్రభావం నుంచి బయటపడడంతో పాటు, లోకల్గా డిమాండ్ మెరుగుపడడంతో ఈ ఏడాది దేశ జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనావేసింది. యూఎస్ కోసం వేసిన అంచనాల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ కాగా, వరల్డ్ ఎకానమీ కోసం వేసిన అంచనాల కంటే రెండింతలు ఎక్కువ కావడం గమనించాలి.
ఫైనాన్షియల్ షేర్లు మరింత పైకి..
వడ్డీ రేట్లు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మార్జిన్లు మెరుగుపరుచుకుంటున్న ఫైనాన్షియల్ కంపెనీలపై డాయిష్ బ్యాంక్ ఎక్కువ పాజిటివ్గా ఉంది. ఇండస్ట్రియల్స్, కన్స్ట్రక్షన్ సెక్టార్లోని కంపెనీలు కూడా మంచి పనితీరే కనబరుస్తాయని అంచనా వేసింది. టెక్ కంపెనీలపై మాత్రం ‘న్యూట్రల్’ వైఖరిని అనుసరించింది. ఈ ఏడాది జూన్లో నికరంగా 3.2 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు కొన్నారు. అంతకు ముందు తొమ్మిది నెలల్లో 33 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మిన ఎఫ్ఐఐలు తాజాగా నికర కొనుగోలుదారులుగా మారారు.