- డీసీసీ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ
ఆసిఫాబాద్, వెలుగు: జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని డీసీసీ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కెరమెరి మండలం కొత్తగూడలో కొలాం ఆదివాసీల కోసం ప్రభుత్వం నిర్మించిన 25 ఇందిరమ్మ ఇండ్లను సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం కాగజ్నగర్ ఎక్స్ రోడ్లో భారీ బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు.
డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ సభ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే వేదికగా నిలుస్తుందన్నారు. జిల్లా ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. నియోజకవర్గం ఇన్చార్జ్ శ్యామ్ నాయక్, గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల మంగ, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరావు తదితరులు పాల్గొన్నారు.
